Lokesh : ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వైఎస్ఆర్‌సీపీ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. డోర్ నెంబర్‌కి..సర్వే నెంబర్‌కి తేడా తెలియని కిరాయి గాళ్లతో విష ప్రచారం జగన్ చేయిస్తున్నారని మండి పడ్డారు. చిన్న‌మ్మ మ‌ర‌ణంతో మేము విషాదంలో వుంటే విష‌ప్ర‌చారం చేస్తూ వినోదం పొందుతావా? అని జగన్ ను ప్రశ్నించారు. 





కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. పోస్టుమార్టం కూాడ నిర్వహించారు. ఎవరూ ఎలాంటి ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. అయితే గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఇంచార్జ్‌గా పని చేసే నేత... తన సోషల్ మీడియా ఖాతాలో ఓ భూవివాదంలో లోకేష్‌తో ఆమె గొడవ పడిన తర్వాత చనిపోయిందని ఆరోపించారు. అయితే ఆయన చెప్పిన సర్వే నెంబర్ల భూమి అసలు లేదు. ఈ విషయాన్ని టీడీపీ సోషల్ మీడియా వెలుగులోకి తెచ్చింది. 


 


అయితే గుర్రంపాటి దేవందర్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. ఈ సారి హెరిటేజ్ షేర్ల గురించి వివాదం నడిచిందని చెప్పారు. అయితే ఏదో ఓ విధంగా ఆరోపణలు  చేయడానికే ఇలాచేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి కూడాఅదే తరహా ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత కావడంతో  ఆయన ఇలా ఓ కుటుంబం గురించి ట్వీట్లు చేయడంపై నెటిజన్లలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.



అయితే గతంలో వైఎస్ జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్యకు  గురైనప్పుడు వైఎస్ఆర్‌సీపీ నేతలు మొదటగా గుండెపోటుగా ప్రచారం చేశారు.తర్వాత పోస్టుమార్టంలో హత్య అని బయటపడింది. ఆ కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడానికే ఇలా ఎలాంటి ఆధారాలు లేకపోయినా నారా లోకేష్‌ను టార్గెట్ చేసుకుని ట్వీట్లు చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి ఆరోపణలు చేసిన వారిని తాము వదిలి పెట్టబోమని హెచ్చరిస్తున్నాయి.