గుంటూరులోని జిన్నాటవర్‌ను కూల్చేయాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు.  పాకిస్తాన్ జాతి పిత అయిన  మహమ్మద్ అలీ జిన్నా పేరు మీద గుంటూరులో ఎలా స్థూపం ఉందని రాజా సింగ్ ప్రశ్నిస్తున్నారు.  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. జిన్నా టవర్‌కు తక్షణం కలాం పేరు లేదా గుంటూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ రచయిత జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం స్పందించకపోతే..  బీజేపీ కార్యకర్తలు టవర్‌ను కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 





Also Read: ఏపీలో 'ఆర్ఆర్ఆర్'కు ఇది ప్లస్సే... మరి, టికెట్ రేట్స్ సంగతి?


గుంటూరులో జిన్నాటవర్ సెంటర్‌కు ప్రత్యేకత ఉంది.  నగరం నడిబొడ్డున ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలకు ప్రధాన కూడలి ఆ ప్రాంతం. జిన్నా టవర్ సెంటర్ అని ప్రజలు అనుకుంటారు కానీ.. ఆ జిన్నా ఎవరూ అని ఆలోచించేవారు 90శాతం మంది ఉండరు. అయితే  ప్రాంతాల పేర్లతో రాజకీయం ప్రారంభమైన తర్వాత జిన్నా టవర్ సెంటర్ కూడా వివాదాస్పదం అవుతోంది. గతంలోనూ కొన్ని సార్లు ఆ టవర్ పేరు మార్చాలని డిమాండ్లు వచ్చాయి. ఆ తర్వాత సద్దు మణిగాయి. 


Also Read: సీజ్‌ చేసిన సినిమా థియేటర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. మంత్రి వెల్లడి


నిజంగానే జిన్నాటవర్ కు ఉన్న పేరు.. పాకిస్తాన్ జాతిపిత అయిన మహమ్మద్ అలీ జిన్నా గౌరవార్థమే ఏర్పాటు చేశారు. దేశ విభజనకు ముందే ఈ టవర్‌ను నిర్మించారు. అంటే పాకస్థాన్ ఏర్పాటు కాక ముందే గుంటూరులో జిన్నాటవర్ నిర్మాణం జరిగిందన్నమాట.  క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో మొహమ్మద్ ఆలీ జిన్నాతో సభ నిర్వహించాలని కొంత మంది ఏర్పాట్లు చేశారు. అయితే మొదట వస్తానని చెప్పిన జిన్నా చివరి క్షణంలో పర్యటన రద్దు చేసుకున్నారు. పలువురు స్వాతంత్ర్య సమరయోధులు ఆ సభలో పాల్గొన్నారు. అయితే జిన్నా రాకపోయినప్పటికీ ఆయన గౌరవార్థం ఈ టవర్ నిర్మించారని..  1945 నుంచి ఈ టవర్ ను జిన్నా టవర్‌గా పిలవడం ప్రారంభించారని చెబుతారు. 


Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్


గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువ. జిన్నా టవర్ కూడా తూర్పు నియోజకవర్గం కిందకే వస్తుంది. అయితే హిందువులు కూడా ఎక్కువే ఉంటారు. మత సామరస్యానికి గుంటూరులో ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. హిందూ, ముస్లింలు కలసి మెలిసి ఉంటారు.  నగరంలో ముస్లిం ప్రముఖుల పేర్లతో వీధులు, రోడ్లు చాలా ఉంటాయి.  అయితే కార్గిల్ యుద్ధం వంటి కొన్ని సందర్భాల్లో కొందరు భావోద్వేగాలతో జిన్నా టవర్ విషయంలో కొందరు అభ్యంతరాలు పెట్టారు. అవి రాను రాను పెరుగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ నేతలు కూల్చివేతలకు డిమాండ్ చేస్తున్నారు.  ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి !


Also Read: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారా ? ఇదిగో ఈ రూల్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోండి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి