Fact Check :  తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో ఫేక్ పోస్టుల ప్రచారం  ఇరిటేషన్ తెచ్చి  పెడుతోంది. ఓ వైపు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును ఆధారాల్లేని కేసులో అక్రమంగా జైల్లో ఉంచారని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు.. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడుతున్నారు. తాజాగా ఎలాంటి  గుర్తింపు లేని.. ఇటీవలే ప్రారంభమైన ఓ ట్విట్టర్ అకౌంట్ నుండి.. సింగపూర్‌లో చంద్రబాబు ఆస్తులను సీజ్ చేశారంటూ ఓ వార్తను పోస్టు చేశారు దీన్ని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు షేర్ చేస్తున్నారు. ఆ వార్తలో సింగపూర్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పారు కానీ.. ఎలాంటి అధికారిక సమాచారం లేదు.  ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న ఫోటోలతో ఆ వార్తను తీర్చిదిద్దారు. ఈ ప్రచారంపై టీడీపీ మండిపడింది.                     


సింగపూర్ కి చెందిన ఇన్ ల్యాండ్ రెవెన్యూ అథారిటీ ఆ దేశంలోని చోవా చు కాంగ్ అనే ప్రాంతంలో చంద్రబాబు గారికి చెందిన వేల కోట్ల ఆస్తులని అటాచ్ చేసినట్టు వైసీపీ పేటీఎం గాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారం ఇది. ఇంకా ఇలాంటివి ఎన్నో ఫేక్ ప్రచారాలకు వైసీపీ తెగబడిందని.. ఇలాంటి వాటిని నమ్మవద్దని  ప్రజల్ని కోరింది.                               





  చంద్రబాబును టార్గెట్ చేసుకుని   తప్పు చేసినట్టుగా ప్రజల్ని నమ్మించేందుకు సజ్జల భార్గవ్‌రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ సోషల్‌ మీడియా విభాగం ఐప్యాక్‌ సహకారంతో దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ల ‘నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు వ్యవహారంపై నిరుద్యోగులైన యువతి, యువకుడు మాట్లాడుకుంటున్నట్టుగా వైకాపా సోషల్‌ మీడియా విభాగం ఒక సంభాషణ సృష్టించి ప్రచారంలో పెట్టింది. యువతకు చంద్రబాబు అన్యాయం చేశారన్నట్టుగా ఆ సంభాషణ ఉంది. ఇది రెండు పార్టీల మధ్య వైషమ్యాల్ని రాజేయడం కాదా’ అని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు జరుగుతున్నాయి. వాటిని పలుచన చేసేందుకు ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం ఎంత వరకు సబబని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా. దీనిపై విజయవాడ సైబర్‌క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేశాం. సజ్జల భార్గవ్‌రెడ్డిని, ఆ సంభాషణలో పాలుపంచుకున్న వారిని వెంటనే అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలి’ అని  టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.  


ఇటీవలి కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రచారానికి ఫేక్ ఆడియోలు.. ఫేక్ వీడియోలు పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.  ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లుగా మాట్లాడుకుని ఆడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారని అంటున్నారు.