ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌తో మొదలైన రాజకీయం... మరింత వేడెక్కింది. సీఎం జగన్‌పై టీడీపీ నేతల ఆరోపణలను ఘాటుగా తిప్పికొట్టారు మంత్రి రోజా. టీడీపీ నేతలు కూడా రోజాపై అంతే ఘాటుగా విమర్శలు గుప్పించారు. అంతేకాదు... ఈ మాటల యుద్ధం.. ఇప్పుడు వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. టీడీపీ నేత బంగారు సత్యనారాయణమూర్తి మంత్రి రోజాపై వ్యక్తిగత దూషణలు చేశారు. ఆమె క్యారెక్టర్‌పై నిందలు వేశారు. పర్సనల్‌ వీడియోలు తన దగ్గర ఉన్నాయంటూ... అవి బయట పెడితే ఏమవుతుందో చూసుకోవాలంటూ హెచ్చరించారు. సీఎం జగన్‌ను కూడా ఆయన దూషించారు. ఈ రెండు ఘటనపై కేసులు నమోదు చేశారు పోలీసులు. బండారు సత్యనారాయణను అరెస్ట్‌ చేశారు. ఆయనకు బెయిల్‌ వచ్చింది. అయితే... బండారు వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపం చెందిన మంత్రి రోజా... నిన్న మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. ఒక మహిళా మంత్రిని నీచంగా మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. మంత్రి రోజా కన్నీరుపెట్టుకోవడంపై కూడా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.


మంత్రి రోజా లాంటి మహానటిని చూస్తే నవ్వు వస్తోందన్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత. అసభ్య పదజాలానికి కేరాఫ్‌ అడ్రెస్సే రోజా అని విమర్శించారామె. మహిళలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నీచ సంస్కృతికి తీసుకొచ్చిందే రోజా అని ఆరోపించారు అనిత. అసెంబ్లీలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై ఆమె చేసిన విమర్శల వీడియోలను మీడియా ముందు ప్లే చేసి వినిపించారు. అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుని కామ సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారనే మాట వాస్తవం కాదా అని నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి రోజా తనను కూడా ఎన్నోసార్లు అవమానించిందని చెప్పారు. అసెంబ్లీలో వెకిలి నవ్వులు నవ్వుతూ బాధపెట్టిన క్షణాలను తాము మరచిపోలేదన్నారు. ఆనాడు మహిళ అనే విషయం రోజాకు గుర్తులేదా అని ప్రశ్నించారు. మంత్రి రోజాను ఏదో అన్నారని.. తమ పార్టీ నాయకుడు బండారు సత్యనారాయణను ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసినట్టు... 200 మంది పోలీసులను పెట్టి లాక్కెళ్లారని ఆరోపించారు. 


నాలుగున్నర ఏళ్లలో లక్షా 20వేల మంది మహిళలు, ఆడపిల్లల వేధింపులకు గురైతే మంత్రి రోజా బాధలేదా... అప్పుడు ఎందుకు మాట్లాడలేదని గట్టిగా నిలదీశారు టీడీపీ నేత అనిత. మద్యపానం నిషేధం పేరు చెప్పి ఓట్లు వేయించుకుని మోసం చేయలేదా అని ప్రశ్నించారు. రోజాకు రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు అని... అలాంటి నాయకుడిపై నోటికొచ్చిన విమర్శలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలని అని ప్రశ్నించారు అనిత. బండారు సతీమణి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి... ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వలేదని అనిత ఆరోపించారు. సీఎం జగన్‌ సతీమణి భారతిరెడ్డి గురించి ఒక్కమాట మాట్లాడితే నిమిషాల్లో పోలీసులు ఇళ్లకు వస్తారని మండిపడ్డారు. టీడీపీ మహిళా నేతలపై అసభ్యంగా మాట్లాడితే వారిపై కేసులు ఉండవా? మా ఫిర్యాదులపై ఇప్పటి వరకు విచారణ జరగలేదని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.