YSRCP News :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారసుల ఎంట్రీ ఉత్కంఠ రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో వారసులను దించాలని కీలక నేతలు అంతా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు తమ వారసులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇంకొందరైతే వేదికలపై ప్రకటించేస్తున్నారు కూడా. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేమని తమ వారసులను బరిలోకి దించేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా వేడుకుంటున్నారు. ఇటీవలి కాలం వరకూ సీనియర్లే పోటీ చేయాలని జగన్ ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఇప్పుడు క్రమంగా మనసు మార్చుకుంటున్నారని పలువురికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని చెబుతున్నారు. 


పలువురు వారసులకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ 


ఆరు నెలల కిందట ఈ సారి వారసుల పోటీకి అంగీకరించేది లేదని జగన్ తన వద్దకు ప్రతిపాదనలతో వచ్చిన వారికి తేల్చి చెప్పారు.  మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వారసుల పొలిటికల్ ఎంట్రీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.  ఇప్పటికే సీట్ల ఖరారుపై ఫోకస్ సైతం పెట్టారు.  ఇదే సమయంలో సీనియర్ నేతలు పలువురు తమ వారుసులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీలోని సీనియర్ నేతలు పలువురు తమ వారసులకు సీట్ల విషయంలో సీఎం జగన్ తో సమావేశం అవుతున్నారు.   అనేక కారణాలు తెలియజేస్తూ తమ వారసులకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు నేతలు. గతంలో సాధ్యం కాదని జగన్ చెప్పినా ఇప్పుడు కొంత మందికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. 


కొంత మంది వారసులకు లైన్ క్లియర్ 


 ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారసుల ఎంట్రీ విషయంలో కొందరికి మినహాయింపు ఇచ్చారు.  చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. అలాగే మాజీమంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు రాజకీయ ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి కి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇదే తరహాలో శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, చెన్నకేశవ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు తమ వారసులకు సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా తన కుమార్తెకు టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకున్నారని చెబుతున్నారు. రేపల్లె నుంచి రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ సైతం తనయుడికి ఈసారి టికెట్ కన్ ఫర్మ్ చేసుకునే పనిలో పడ్డారు. వీరే కాదు స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణ ప్రసాద్, పినిపే విశ్వరూప్, తిప్పల నాగిరెడ్డి ఇలా పలువురు నేతలు సైతం తమ వారసుల ఎంట్రీకి పక్కాగా ప్లాన్స్ వేస్తున్నారు. వీరితోపాటు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాశ్ ను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో రామచంద్రాపురం రాజకీయంలో చిచ్చు మెుదలైంది.


మిగిలిన నేతలూ ఒత్తిడి పెంచే వ్యూహంలో  నిమగ్నం


ధర్మాన ప్రసాదరావు ఇక తాను రెస్ట్ తీసుకుంటానని తన కుమారుడికి చాన్సివ్వాలని జగన్ కు చెప్పారు. అయితే జగన్ మాత్రం ఈ సారి మీరే పోటీ చేయాలని అడిగారని చెబుతున్నారు. కానీ ధర్మాన మాత్రం కుమారుడికే టిక్కెట్ ఇప్పించాలని  రాజకీయం చేస్తున్నారు బహిరంగ ప్రకటనలు చేయడం ద్వారా హైకమాండ్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం  చేస్తున్నారు. చివరిగా టిక్కెట్లు ఖరారు చేసే వరకూ సీనియర్లు వారుసల కోసమే ప్రయత్నం చేయనున్నారు.