Telangana MIM : తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రేపో మాపో రాబోతోంది. ఈసారి తెలంగాణ గడ్డపై గద్దెనెక్కేదెవరు అన్న ఆసక్తి రాజకీయాల్లో తారాస్థాయికి  చేరుతోంది. మళ్లీ మేమే అని బీఆర్ఎస్, ఈసారి మా వంతు అని కాంగ్రెస్సు.... మేం లేమా అని బీజేపీ కలబడుతున్నాయి. ఇవన్నీ తెలంగాణ రణక్షేత్రంలో గట్టిగా తలబడుతుంటే.. ఒక పార్టీ మాత్రం చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది. తాము కింగ్ అవలేం కానీ.. కింగ్ మేకర్ కావొచ్చని అనుకుంటోంది.  తెలంగాణ హంగ్ వస్తే.. తమకు మంచి డిమాండ్ ఉంటుందని ఆ పార్టీ అనుకుంటోంది. ఎందుకంటే ఎందుకంటే ఏది ఏం జరిగినా ఆ పార్టీ కచ్చితంగా గెలిచే సీట్లు కొన్ని ఉన్నాయి. అదే మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్.. MIM. తెలంగాణలో హంగ్ రావాలని.. వస్తే ఇక తమదే హంగామా అని ఆ పార్టీ అంచనాలు కడుతోంది. 


తెలంగాణలో హోరాహోరీ పోరు ఉండే అవకాశం 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండ సార్లు  ఎన్నికలు జరిగాయి. రెండు సార్లు బీఆర్ఎస్‌కు పూర్తి మెజార్టీ వచ్చింది. కానీ తెలంగాణ రాజకీయాల్లో ఒక విభిన్నత ఉంది. ఇక్కడ  పార్టీలకు ఓటు బ్యాంక్ ఉండటం.  తెలంగాణ ఏర్పడిన 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అతి స్వల్ప మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ మొత్తం మీద 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ మార్క్ 60. 2014లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సీట్లు 63. అంటే సాధారణ మెజార్టీ కంటే మూడు అంటే మూడు సీట్లు ఎక్కువ. కిందటి ఎన్నికల్లో బలపడింది. కానీ ఈ సారి మాత్రం పదేళ్ల అధికార వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ సీన్ అయిపోయింది.. ఇక బీజేపీనే ప్రత్యామ్నాయం అంటూ జరిగిన ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ బలంగా తయారైంది. మొదటి ఎన్నికల్లో  కాంగ్రెస్‌తో పాటు  టీడీపీ, బీజేపీ, వైసీపీ, మజ్లిస్ , కమ్యూనిస్టులు ఇలా అన్ని పార్టీలూ ఓట్లు, సీట్లు తెచ్చుకున్నాయి. అన్ని పార్టీలకూ అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కింది. కానీ  రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఆర్ చాలా పార్టీల్ని నిర్వీర్యం చేయడంలో విజయవంతం అయ్యారు. 2018కి వచ్చే సరికి .. టీడీపీ  పూర్తిగా బలహీనపడింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రెండు సీట్లకే పరిమితమయింది. బీజేపీకి ఒక్క సీటే మిగిలింది. ఇప్పుడు మళ్లీ మూడో సారి ఎన్నికలకు వచ్చే సరికి తెలంగాణ రాజకీయం మరింతగా మారిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ , బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి.  పాతబస్తీని కంచుకోటగా మార్చుకున్న మజ్లిస్ ..  మరిన్ని సీట్లు పెంచుకోవాలనుకుంటోంది. 


మజ్లిస్‌కు ఏడు సీట్లు గ్యారంటీ - మరో నాలుగైదు సీట్ల కోసం ప్రయత్నం 


మజ్లిస్ భిన్నమైన రాజకీయం చేస్తుంది. భారత దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ ప్రజలకు ఏమి  చేస్తామో మేనిఫెస్టో విడుదల చేస్తాయి. కానీ మజ్లిస్ చరిత్రలో మేనిఫెస్టో అనే పదమే ఇంత వరకూ ఉపయోగించలేదు. ప్రజలకు ఏమి చేస్తామో వారు చెప్పరు. కానీ ఆ ప్రాంత ప్రజలు మరో  ప్రత్యామ్నాయం చూడరు. ఒకప్పుడు మజ్లిస్ బచావో తెహరిక్.. ఎంబీటీ పార్టీ పోటీగా ఉండేది. కానీ మజ్లిస్ రాజకీయాల దెబ్బకు మెల్లగా ఆ పార్టీ ఫేడవుట్ అయిపోయింది. MIM వాళ్లు అధికారంలో ఉండే ప్రతీ పార్టీతో సన్నిహితంగా ఉంటారు. పాతబస్తీ జోలికి రాకుండా ఉంటే..  బయట వైపు తమ మద్దతు ఉంటుందని నమ్మకం కలిగిస్తారు. అందుకే మరే పార్టీ మజ్లిస్ కంచుకోటల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. దాంతో ఆ ప్రాంతాన్ని మజ్లిస్ తమ సామ్రాజ్యంగా మలుచుకుంది. ఇప్పుడు మజ్లిస్ మరింతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. కింగ్ మేకర్లు కావాలని టార్గెట్ గా పెట్టుకుంది.  తమ ప్రమేయం లేకుండా రాజకీయం ఉండదని అక్బరుద్దీన్ చాలాసార్లు అన్నారు. 


వచ్చే ఎన్నికల తర్వాత కింగ్ మేకర్లం తామేనని మజ్లిస్ భావన


తెలంగాణలో ఏ పార్టీ గెలిచినా అధికారంలో కూర్చోబెట్దేది మాత్రం తామేనని మజ్లిస్‌ గట్టి నమ్మకంతో చెబుతోంది. మజ్లిస్‌కు పాతబస్తీలో పట్టు ఉంది. అక్కడ ఏడు అసెంబ్లీ సీట్లలో ఆ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. కాంగ్రెస్ లేదా.. బీఆర్ఎస్ పార్టీకి  మ్యాజిక్ మార్క్‌కు  సీట్లు తక్కువ వచ్చాయంటే.. మజ్లిస్ మీద ఆధారపడాల్సిందే. ఇప్పటి వరకూ మజ్లిస్ ఎప్పుడూ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వలేదు. గ్రేటర్ కార్పోరేషన్ ఎన్నికల్లో మాత్రం ఓసారి అధికారాన్ని పంచుకున్నారు కానీ  రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం భాగస్వామ్యం కాలేదు. మజ్లిస్ రాజకీయం ఎప్పుడూ వేరేగా ఉంటుంది. వాళ్లకి కావలసింది పదవులు కాదు. పవర్. పాతబస్తీకి సంబంధించిన పవర్ ఉంటే చాలనుకుంటారు. అందుకే ఈ సారి  పాతబస్తీలో వచ్చే ఏడు సీట్లు కాకుండా.. బయట మరో మూడు, నాలుగు సీట్లలో గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. 


అలాంటి పరిస్థితి వస్తే మజ్లిస్ ఎవరి వైపు ఉంటుంది ? 


ఇప్పటి  వరకూ ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న  మజ్లిస్ తెలంగాణలో మాత్రం పాతబస్తీకే పరిమతమవుతూ వస్తోంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని భావిస్తోంది.  కిందటి  బడ్జెట్ సమావేశాల్లో కేటీఆర్‌తో వాగ్వాదం సందర్భంగా మజ్లిస్ పార్టీ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ  వచ్చేసారి కనీసం 15 మంది ఎమ్మెల్యేలతో శాసనసభకు వస్తామని  సవాల్ చేశారు. అందుకు అనుగుణంగానే ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. దాదాపు 30 సీట్లలో పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వీటిలో 15 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. పాతబస్తీలోని చార్మినార్, యాకుత్ పురా, మలక్ పేట, బహదూర్ పురా, కార్వాన్, చాంద్రాయణగుట్ట, నాంపల్లి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఈ సీట్లలో గెలుస్తూ వస్తోంది. పాతబస్తీలోని 7 స్థానాలతో పాటు మహబూబ్‌‌నగర్, గద్వాల, రాజేంద్రనగర్, గోషామహల్, ముషీరాబాద్, అంబర్ పేట, నిజామాబాద్ అర్బన్, బోధన్, ముధోల్, ఆదిలాబాద్, వరంగల్ తూర్పు, నిర్మల్, బాన్సువాడ, కరీంనగర్, జహీరాబాద్, సంగారెడ్డి, ఆందోల్, తాండూరు, కొడంగల్ తదితర నియోజకవర్గాల్లో నముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుంది. అలాంటి   చోట్ల అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న  చోట్ల  బీసీలకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా రెండు వర్గాలను ఆకట్టుకుని గెలవాలనేది  మజ్లిస్ ప్లాన్. గతంలో ఇలాంటి ప్రయోగాలు పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ హిందూ అభ్యర్థుల్ని నిలబెట్టారు.  20 నుంచి 25 శాతం మైనారిటీ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టి, ఆయా చోట్ల పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. 


అవకాశం కోసమే మజ్లిస్ ఎదురు చూపు ! 


మజ్లిస్‌కు  పర్మనెంట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ ఉండరు. అధికారంలోకి ఎవరు వస్తే.. వాళ్లతో కలిసి రాజకీయం చేస్తారు. మొన్న సీట్లు ప్రకటించినప్పుడు కూడా మజ్లిస్ మాకు మిత్రపక్షం.. వాళ్లున్న చోట ఫ్రెండ్లీ ఫైట్ అని కేసీఆర్ చెప్పారు కానీ.. ఓవైసీ మాత్రం ఇప్పటి దాకా బీఆర్‌ఎస్ తమ మిత్రపక్షం అని నేరుగా చెప్పలేదు. కానీ ఈ మధ్య కాలంలో వీళ్ల మధ్య సంబంధాలు బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే మజ్లిస్‌కు కాంగ్రెస్ ఎప్పుడూ మిత్రపక్షమే. ఒకవేళ అధికారం షిఫ్ట్ అయితే... కాంగ్రెస్ తో కలిసిపోవడానికి వాళ్లకి పెద్ద అడ్డంకులు ఏం ఉండవ్. మరి బీజేపీ వస్తే పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. MIM చాలా రాష్రాల్లో బీజేపీకి బీ-టీమ్ అన్నది ఎన్నాళ్లుగా వినిపిస్తన్న విమర్శ. మరి తెలంగాణలో బీజేపీకి అధికారం ఇవ్వడానికి సహకారం బ్యాకప్ ఏమైనా చేస్తారా అన్నది కూడా ఆలోచించాలి. ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ముస్లిం ఓట్లను దూరం చేసే వ్యూహమని విమర్శలు ఎలాగూ ఉన్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా MIM మాత్రం తన పట్టును కోల్పోలేదు. ఈ సారి ఆ పట్టును మరింత బిగించాలని చూస్తోంది.