Penukonda Ra Kadali Ra Sabha: కియా పరిశ్రమ తెచ్చి వేలమందికి ఉపాధి కల్పించామని, 2014లో ఈ ప్రాంతం ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది? అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రశ్నించారు. అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన రా.. కదలి.. రా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలంతా అంటున్నారని, టీడీపీ-జనసేన కలిసింది తమ స్వార్థం కోసం కాదని అన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకునేందుకే టీడీపీ, జనసేన కలిశాయని, అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆడుకుంటామని, అనంతపురం జిల్లా అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు.


రిజర్వాయర్‌ను పూర్తి చేసి కియాను తెచ్చాం 
'అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం. ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాలని సంకల్పించాం. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చాం. సాగునీటి ఇస్తే చాలు.. రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ను 18 నెలల్లో పూర్తి చేసి కియాను తెచ్చాం. కియాలో ఇప్పటివరకు 12 లక్షల కార్లు తయారయ్యాయి. ఈ కంపెనీ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి  ఉద్యోగాలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో బిందు, తుంపర సేద్యం మరింత పెరగాలి. జిల్లాలో పళ్లు, కూరగాయలు కూడా పండుతాయి. మేం అధికారంలోకి వస్తే సాగునీరు, పెట్టుబడులు, ఉపాధి పెరిగేవి. నాలెడ్జ్ హబ్, సైన్స్ సిటీ వల్ల ఒక్కరికైనా ఉద్యోగాలు వచ్చాయా? మేం ఉన్నప్పుడు మెగా సోలార్ ప్రాజెక్టును తెచ్చాం. జిల్లాలో సౌర, పవన విద్యుదుత్పత్తి పెంచాం. మీ పొలాల్లోనే విద్యుత్ ఉత్పత్తి చేసుకుుని అమ్ముకోవచ్చు. స్కీముల్లో కూడా స్కామ్‌లు చేసే వ్యక్తి జగన్' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఉచితంగా సోలార్ పంపుసెట్లు 
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను ఎప్పుడూ భావితరాల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తానని, రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా చేయాలనేది తన సంకల్పమన్నారు. నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాలకు సాగునీరు ఇస్తామని, మన యువత ఎంతో తెలివైనవాళ్లు అని, వారికే  ఇక్కడే ఉపాధి కల్పిస్తామని తెలిపారు. రాయలసీమకు తెచ్చిన పెట్టుబడులు ఏమిటో జగన్ చెప్పాలని, ఈ ఐదేళ్లలో రాయలసీమలో ఏదైనా ప్రాజెక్టు నిర్మించారా? అని ప్రశ్నించారు. రాయలసీమకు ఏ పార్టీ మేలు చేసిందో ప్రజల గ్రహించాలని సూచించారు. వృద్దులకు ఫించన్ ఇవ్వడం ప్రారంభించింది ఎన్టీఆర్ అని, హైదరాబాద్, బెంగళూరు వెళ్లినవారికి జగన్  ఫించన్లు కట్ చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉపాధి కోసం బయట ప్రాంతాలకు వెళ్లిన వారికి ఫించన్ ఇస్తామన్నారు.  జగన్ ఐదేళ్లల్లో యువతకు  ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, తాను ఐటీ ఉద్యోగాలు ఇస్తే.. జగన్ ఇచ్చింది వాలంటీర్  ఉద్యోగాలు అని విమర్శించారు.


'వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది.. ఎవరి ఉద్యోగం తీసేయం. వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది.. వారికి న్యాయం చేస్తాం. వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరుతున్నా. జగన్ అధికారంలోకి వచ్చాక చెత్తపన్ను, ఇంటిపన్ను, మద్యం ధరలు పెంచారు. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ధ్వంసం చేయడం జగన్ మార్కు. అభివృద్దిలో మా పార్టీతో పోల్చుకోవద్దని జగన్‌ను కోరుతున్నా.. వివేకా హత్య కేసులో అనేక పిల్లిమొగ్గలు వేసింది ఎవరు? వివేకాను ఎవరు చంపారో చెప్పాల్సిన బాధ్యత జగన్‌కు లేదా?  మా కార్యకర్తలను వేధించేవారిపై చర్యలు తప్పవు' అని చంద్రబాబు తెలిపారు.