Telugu News: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో తాడిపత్రిలో జరిగిన గొడవల కారణంగా పోలీసులు అల్లర్లను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇందులో స్మోక్ బాంబులను వాడారు. ఇది ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంపై ప్రభావం చూపింది. స్మోక్ బాంబుల పొగను పీల్చుకొని కొంతకాలం హైదరాబాద్ లోనే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. 


అనంతరం గత నాలుగైదు రోజుల కిందట తీవ్రమైన స్ట్రోక్ కు గురి కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రభాకర్ రెడ్డి చికిత్స పొందారు. దీనికి సంబంధించి జెసి ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేవుడి దయతో ప్రజల ఆశీర్వాదంతో నేను ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని అన్నారు. నిజంగా నేను మీ అందరిని చూస్తానని అనుకోలేదని ఆవేదనగా వీడియోలో వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరు కూడా తనని చూడడానికి హైదరాబాద్ కు రావద్దని పిలుపునిచ్చారు. 15 రోజులు విశ్రాంతి అనంతరం తానే తాడిపత్రికి తిరిగి వస్తానని వీడియోలో తెలిపారు.