Srikakulam Train Accident: అమరావతి: శ్రీకాకుళం జరిగిన రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం (YS Jagan announces ex-gratia to Srikakulam Train Accident Victims) ఇవ్వాలన్నారు. రైలు ప్రమాద ఘటనకు సంబంధించి జిల్లాకలెక్టర్‌ నివేదించిన తాజా వివరాలను ముఖ్యమంతి కార్యాలయ కార్యదర్శి సీఎం జగన్ కు అందించారు. రైలు ఢీకొన్న ఘటనలో అయిదుగురు మరణించారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మరణించిన వారిలో గుర్తింపు కార్డులు ఆధారంగా ఇద్దరు అసోం రాష్ట్రానికి చెందినవారుగా తేల్చారన్నారు. మిగిలిన ముగ్గురిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారు కూడా వేరే రాష్ట్రానికి చెందినవారై ఉంటారని, ఇదే విషయాన్ని అధికారులు తెలిపారని సీఎంకు వివరించారు. 


ఇతర రాష్ట్రాల వారున్నా ఆదుకోండి.. 
ఈఘటనలో గాయపడ్డ ఒక వ్యక్తిని అదే రైలులో శ్రీకాకుళం తీసుకు వచ్చారని, వెంటనే అతన్ని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారని వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక ఆర్డీఓ ప్రమాద స్థలాన్ని సందర్శించి అవసరమైన చర్యలు తీసుకున్నారని, గాయపడ్డ వ్యక్తికి అందుతున్న వైద్యాన్ని కలెక్టర్‌ స్వయంగా రిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారని, మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారని, అక్కడ అందుతున్న వైద్యంపైనా కలెక్టర్‌ పర్యవేక్షిస్తున్నారని వివరించారు. మరణించిన వారు పరాయి రాష్ట్రం వారైనా, మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఇవ్వాలని, ఈసహాయం వెంటనే అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.







విషాదం ఇలా జరిగింది..
సాంకేతిక సమస్యతో గౌహతి ఎక్స్ ప్రెస్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ట్రాక్ పై దిగారు. ప్రయాణికులు పట్టాలు దాటుతున్న సమయంలో విశాఖ నుంచి వస్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ (Konark Express Accident) వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.  సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లర్కర్ సహాయక చర్యల్లో పాల్గొనాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.


Also Read: Srikakulam Trian Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం, కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొని ఐదుగురి మృతి 


Also Read: Nellore News: పోలీసులకు "దిశ" దశ లేదా? యూనిఫామ్‌తో రోడ్డెక్కిన కానిస్టేబుల్‌