ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అరెస్టు అనంతరం జరుగుతున్న పరిణామాల వేళ నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన గురువారం (సెప్టెంబరు 14) ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ విషయం గురించి నారా లోకేశ్ జాతీయ మీడియాతో రేపు (సెప్టెంబరు 15) మాట్లాడనున్నారు. రాష్ట్రంలో పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేశ్ ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై లోకేశ్ జతీయ మీడియాకు వివరించనున్నారు. చంద్రబాబు అరెస్టుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద కూడా దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా లోకేశ్ ప్రయత్నాలు చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.


అంతేకాక, చంద్రబాబుపై అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీ పెట్టిన కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిసి కూడా నారా లోకేశ్ చర్చించనున్నారు. అటు పార్లమెంట్ లో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలను చర్చించేలా టీడీపీ వ్యూహం వేసింది. అందుకోసం చంద్రబాబు అరెస్ట్ పై లోక్ సభలో చర్చ కోసం పార్టీ ఎంపీలతో లోకేశ్ మాట్లాడనున్నారు.