Janasena Chief Pawan Kalyan Eluru Meeting Key Points: : ఏలూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్నది దిగజారుడు రాజకీయాలు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. పాలిటిక్స్ లో విలువలు నిలబెట్టేలా తాను వ్యవహరిస్తుంటే అధికార పార్టీ వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని, తనను వ్యక్తిగతంగా దూషిస్తూ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వారాహి విజయయాత్ర రెండో విడత ఆదివారం సాయంత్రం ఏలూరు నుంచి ప్రారంభమైంది. మహానుభావుడు అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నా.. దిగజారి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్ ను ఇక నుంచి నువ్వు అని ఏకవచనం తోనే పిలుస్తాను అన్నారు. హోదా మరిచి దిగజారి వ్యాఖ్యలు చేస్తుంటే, గౌరవం ఇవ్వాల్సిన అగత్యం లేదని స్పష్టం చేశారు. మర్యాద పుచ్చుకోలేని వారికి ఇవ్వడమూ అనవసరం అన్నారు పవన్. సీఎం పదవికి జగన్ అనర్హుడు అని, వైసీపీ నేతల అన్యాయం, దుర్మార్గాలపై ప్రశ్నిస్తున్నానన్న కోపంతోనే తనను పెళ్లిళ్లు అని, లేక ఇంట్లో ఆడవారిపై వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తితంగా దాడి చేయించడం అందుకు నిదర్శనం అన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు, వాటిలో లోపాలను కాగ్‌ నివేదిక వెల్లడించిందన్నారు. ఏపీ ప్రభుత్వం పలు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు నగదును ఎవరి కోసం ఖర్చు చేశారు, ఎక్కడ ఖర్చు చేశారు అని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజలకు ఏదో మేలు చేశామంటూ ప్రతిరోజు చెప్పుకునే వైసీపీ మంత్రులు, నేతలు, సీఎం జగన్.. 1,18,000 కోట్ల అప్పు గురించి రాష్ట్ర ప్రజలకు ఎందుకు చెప్పలేదు అని నిలదీశారు. ప్రజలపై చేసిన అప్పులకు సీఎం జగన్‌ ప్రభుత్వం, మంత్రివర్గం జవాబు చెప్పాల్సిందే అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో పదోవంతుకు పైగా వైసీపీ సర్కార్ అప్పులు తీసుకొచ్చిందని, వాటిని నిజంగానే ప్రజలకు ఖర్చు చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేవని పవన్ అభిప్రాయపడ్డారు.






ఇంటిని సరిగ్గా నడపాలంటే భర్త చేసే అప్పులను భార్యకు చెప్పాల్సి ఉంటుందన్నారు. రూ.500 ఇచ్చి బిడ్డను మార్కెట్ కు పంపిస్తే.. వేటికి ఎంత ఖర్చు చేశావు అని తల్లి బిడ్డను అడుగుతుంది. అయితే లక్షా 18 వేల కోట్లు అప్పుచేసి ప్రజలకు ఈ విషయం చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని పవన్ ప్రశ్నించారు. 



వాలంటీరు వ్యవస్థ అనేది వైసీపీ నేతలకు నిఘా వ్యవస్థ లాంటిది. ఏ ఇంట్లో ఎంత మంది ఉన్నారు. వారు ఏం పనులు చేస్తున్నారు. ఏ పార్టీకి అనుకూలం. ఏ ఇంట్లో ఒంటరి మహిళలు ఉన్నారు అనే విషయాలపై వైసీపీ నేతలు నిఘా పెడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. యువతుల అదృశ్యంపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ సర్కార్ నెరవేర్చలేదన్నారు. మద్య పాన నిషేధం అమలు చేయలేదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సీఎం తమ స్థాయికి తగ్గట్లుగా వందల కోట్ల నుంచి దోచేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఏపీ ప్రజలు బుగ్గలు నిమిరేవారని కాదు, మాటపై నిలబడే వారిని నమ్మాలంటూ జగన్ పై సెటైర్లు వేశారు. ఏలూరులో వరద వస్తే రక్షణ వ్యవస్థ సరిగా లేదన్నారు. ఏపీలో ఏ వర్గానికి కూడా న్యాయం జరగడం లేదని, మరోవైపు లక్షల కోట్ల అప్పులు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతుందన్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial