Man Beats Bhimavaram Traffic Constable: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో (Bhimavaram) ఓ వాహనదారుడి దౌర్జన్యం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాహనదారుడు కానిస్టేబుల్‌పై పిడి గుద్దులు గుద్దాడు. రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలువురిని గాయపరిచి, ఆపకుండా వెళ్ళిపోతున్న కారును ఆపిన పోలీస్ కానిస్టేబుల్ పై (Constable) దౌర్జన్యం చేసి గాయపరిచాడు. భీమవరంలోని (Bhimavaram) గునుపూడి ప్రాంతానికి చెందిన బొబ్బనపల్లి సంతోష్, ర్యాష్ గా బండిని డ్రైవింగ్ చేస్తూ గునుపూడిలో కేబుల్ పని చేసుకుంటున్న వ్యక్తిని గుద్దుకుంటూ వెళ్లాడు. తర్వాత బైక్ పై వెళుతున్న మరో వ్యక్తిని గుద్దుకుంటూ వెళ్లాడు.


అయినా, అతను కారు ఆపకుండా ముందుకు వెళ్తుండడంతో వీరమ్మ పార్క్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు స్థానికులు సమాచారం అందించారు. దీంతో కారును ఆపే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ సతీష్ కుమార్ పై దౌర్జన్యం చేసాడు కారు డ్రైవర్ సంతోష్. ఏ ఊరు నుంచి వచ్చావు, నా కారు ఆపుతావా? అని బూతులు తిడుతూ కానిస్టేబుల్ పైన పిడి గుద్దులు కురిపించాడు. ఆ దాడిలో కానిస్టేబుల్ కు మెడ, చేతి భాగాల్లో తీవ్రంగా గాయాలయ్యాయి. 


సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ తో, దౌర్జన్యంతో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దౌర్జనానికి పాల్పడిన కారు డ్రైవర్ సంతోష్ పై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించినట్లు వన్ టౌన్ సీఐ కృష్ణ భగవాన్ తెలిపారు.


Also Read: NTPC Simhadri: గ్రిడ్ వైఫల్యానికి కారణమదే, విద్యుత్ ఉత్పత్తి నిలిపివేతపై ఎన్టీపీసీ సింహాద్రి వివరణ


కానిస్టేబుల్‌ను (Constable) వాహనదారుడు కొడుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న బైక్‌లను అతను గుద్దేయగా, అదేంటని ప్రశ్నించిన స్థానికులకు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. తమ బైక్‌లను ఎందుకు ఢీకొన్నావని స్థానికులు ప్రశ్నించగా.. రోడ్డుపైన బైక్‌లు ఎవరు పెట్టమన్నారని అడ్డగోలుగా ఎదురు ప్రశ్నించాడు. రోడ్డుపైన ఉంటే నువ్వు గుద్దేస్తావా? అంటూ స్థానికులు నిలదీశారు. అక్కడి నుంచి కారులో జారుకొనే ప్రయత్నం చేయగా, వెంటనే స్థానికులు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను (Traffic Constable) పిలిచారు. ఈ క్రమంలోనే గొడవ చోటు చేసుకుంది.


Also Read: Ramzan 2022: రంజాన్ వేళ ప్రముఖుల శుభాకాంక్షలు - తనదైన శైలిలో అదరగొట్టిన బాలయ్య