AP Fighter Rooster: సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ఏపీ వాసుల్లో వచ్చే ఆనందమే వేరు. రకరకాల పిండి వంటలు, కొత్త బట్టలు, కోడి పందేలు, అల్లుళ్ల రాక, భోగి మంటలు, ఆట పాటలు... అబ్బో ఒక్కటేమిటి సవాలక్ష సంబరాలతో పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే ఈ సంబురాల వీడియోలు చూడడం అంటే చాలా మందికి ఇష్టం. నెట్టింట ఏపీ సంక్రాంతి సంబురాలకు సంబంధించిన అనేక వీడియోలు ఉంటాయి. అయితే ఇలా వీడియోలు చూసిన కొంత మంది థాయ్ లాండ్ వాసులు.. తాజాగా ఏపీలోని ఏలూరుకు వచ్చారు. ముఖ్యంగా కోడి పందాలాకు సంబంధించిన వీడియోలను చూసి  వాటిని కొనుగోలు చేయాలనుకున్నారు. అక్కడి ప్రజలను అడిగి మరి ఓ పందెం కోడి పిల్లలను.. అత్యధిక ధరకు కొనుగోలు చేశారు. 3 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కోడి పిల్లను వెంట తీసుకెళ్లారు. 


27 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్న పందెం కోడి


ఈ ఏడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిలోని గణపవరంలో జరిగిన కోడి పందాల్లో ఓ పందెం కోడి రూ.27 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది. థాయ్ రూస్టర్ ప్రేమికులు ఫేస్‌బుక్‌లో కోడి పందాలను చూసి దానిని సొంతం చేసుకోవాలని అనుకున్నారు. ఆ కోడి యజమాని రత్తయ్యను ఆ కోడిని అమ్మాలని కోరారు. కోడి కోసం వారు 3 రోజుల పాటు అతనిని వేడుకున్నా, రత్తయ్య దాన్ని అమ్మేందుకు ఒప్పుకోలేదు. చివరకు తమ దేశంలో జాతిని అభివృద్ధి చేసేందుకు మరో కోడిని ఎంపిక చేసి రూ.3 లక్షలకు కొనుగోలు చేశారు.


40 ఎకరాల భూమిలో 500 కోళ్ల పెంపకం


27 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్న కోడి కోసం థాయ్ గ్రూప్  తనను ఎంతగానో బతిమాలినట్లు రత్తయ్య చెప్పారు. కానీ తనకు అదృష్టాన్ని తెచ్చి పెట్టిన ఆ కోడిని ప్రాణం పోయినా అమ్మనని అంటున్నారు. అలాగే వియత్నాం, మెక్సికో, కెనడా, యూఎస్‌ఏ, థాయ్‌లాండ్‌ వంటి దేశాలకు చెందిన వారు కోళ్ల కొనుగోలు కోసం ఫేస్‌బుక్‌ ద్వారా తరచూ సంప్రదిస్తున్నారని చెప్పారు. ఇటీవల వియత్నాంకు చెందిన ఓ సమూహం తన వద్ద నుంచి మొత్తం 40 పందెం కోళ్లను కొనుగోలు చేసింది. 40 ఎకరాల భూమిలో దాదాపు 500 పందెం కోళ్లను రత్తయ్య పెంచుతున్నట్లు వివరించారు.