CM Jagan: వరద బాధితులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకున్నామని, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేశాకే పోలవరంలో నీళ్లు నింపుతామని సీఎం జగన్ స్పష్టం చేశారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కోయుగూరులో వరద బాధితులతో సీఎం జగన్ పరామర్శ కొనసాగింది. చింతూరులో దాదాపుగా 20 రోజుల నుంచి మొదటి ప్రమాదపు ఘంటికపైనే దాదాపుగా ఇన్ని రోజులు నీళ్లు ఉన్న పరిస్థితులు కనిపించలేదన్నారు. నాలుగు మండలాల్లో కలెక్టర్ 20 రోజుల పాటు ఉన్నారు. కలెక్టర్, అధికారులు, వాలంటీర్లు.. ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించడం అభినందనీయం అన్నారు.


పోలవరం నిర్వాసితులకు త్వరలోనే ఆదుకుంటామన్న సీఎం జగన్... కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోలవరం నిర్వాసితులకు సత్వర న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లు అయితే ఏదోలా చేసేవాడినని 20 వేల కోట్లకు పైబడి వెచ్చించాల్సిన విషయమని గుర్తు చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ సెప్టెంబర్‌లోగా పోలవరం నిర్వాసితులకు పరిహారం అందజేస్తామన్నారు. 


నిర్వాసితుల తరఫున కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్న సీఎం జగన్... వేగంగా ఇల్లు కూడా నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం పరిహారం ఇచ్చిన తర్వాతే అందరిని వేరేచోటకు తరలిస్తామని భరోసా ఇచ్చారు. నాలుగు మండలాలకు సంబంధించి రెవెన్యూ డివిజన్ కావాలన్న అభ్యర్థన పరిశీలిస్తామన్నారు. త్వరలోనే నెరవేరుస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం ఇప్పించాలని గిరిజన మహిళలు జగన్‌ను వేడుకున్నారు. అందరికీ ఓపికగా సమాధానం చెప్పారు సీఎం. 


5లక్షల పరిహారం ఇస్తామన్న హామీని తప్పక నెరవేరుస్తామన్నారు సీఎం జగన్. మానవత్వం ఉన్న ప్రభుత్వం ఇదని... ఎక్కడ లేని మానవత్వం ఇక్కడ ఉందన్నారు. పూర్తి పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టు నింపుతామని పునరుద్ఘాటించారు. 


వరద బాధితులందరికీ సాయం చేస్తాం..


సహాయం అందరికీ అందాలనే తాపత్రయం కన్నా గతంలో కన్నా పరిస్థితి ఎంతో మారిందని సీఎం జగన్ చెప్పారు. పారదర్శకంగా బాధితులకు పరిహారం అందించామన్నారు. అందరికీ రేషన్, ఇంటింటికీ 2 వేల రూపాయలు అందించాం. అధికారులను భాగస్వామ్యం చేసి.. కావాల్సిన వనరులు సమకూర్చినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా అందరికీ సహాయం, అన్ని సౌకర్యాలు అందాయని నిర్వాసితులు తెలిపారు. ఎవరికి, ఎలాంటి వరద నష్టం జరిగినా సరే.. గ్రామ సచివాలయంలో లిస్టులో ఉంటుందని నష్టం వివరాలు ఏమైనా ఉంటే పేరు లిస్టులో ఉంటుందని, నష్టం వివరాలు ఏమైనా ఉంటే పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం తెలియజేశారు. 


కష్టపడి పనిచేసిన అధికారులందరికీ ధన్యవాదాలు..


వరదల వేళ కష్టపడి పని చేసిన అధికారులు, సిబ్బంది సీఎం జగన్  ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం వరద తగ్గినా పారిసశుద్ధ్యం, ప్రజారోగ్యం, నష్టాల లెక్కింపుపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఇందులో ప్రజా ప్రతినిధులను కూడా మమేకం చేసుకొని కష్టపడితే ప్రజలకు మరింత దగ్గరవుతామని అన్నారు. ఆవ డ్రెయిన్ ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయమని అధికారులను ఆదేశించారు. లంక గ్రామాల్లో కమ్యూనిటీ హాల్లు నిర్మిస్తే పునరావాసానికి వినియోగించుకోవచ్చని సీఎం జగన్ తెలిపారు. గతంలో అధికారులను సస్పెండ్ చేసి హడావుడి చేసేవారు. మనం అధికారులను ప్రోత్సహించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. 


పోలవరం బాధితులకు సెప్టెంబర్ లోగా సాయం చేస్తాం..


కరకట్టల ఆధునికీకరణపై అంచనాలు సిద్ధం చేయమన్నారు. డెల్టా ఆధునికీకరణ, గోదావరి వరదల నుంచి శాశ్వత పరిశ్కారం కోసం అందజేసిన డీపీఆర్‌పై సాంకేతిక అంచనాలు తయారు చేసి నివేదించాలి. గట్టలు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో గుర్తించి నవంబర్ లోగా టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుందామన్నారు. విద్యుత్తు పునరుద్ధరణ విషయంలో  జాప్యం జరిగిందని తప్పుగా ప్రచారం చేస్తే దాన్ని తిప్పికొట్టాలి. నిజంగా తప్పుంటే సరిదిద్దుకోవాలని సీఎం జగన్ వివరించారు.