తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విద్యాదీవెన పథకానికి సంబంధించి నిధులను విడుదల చేశారు. 2023 మొదటి త్రైమాసికానికి సంబంధించిన 703 కోట్ల రూపాయల నిధులను బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. రాబోయే రోజుల్లో దేశానికి ఆంధ్రప్రదేశ్‌ దశదిశ చూపించబోతుందన్నారు సీఎం జగన్. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్‌ కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అన్నారు. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయని అభిప్రాయపడ్డారు. వివక్ష పోవాలన్నా పేదరికం పోవాలన్నా చదవన్నదే గొప్ప అస్త్రమని తెలిపారు. 


పిల్లల్లో చదువును ప్రోత్సహించేందుకే విద్యా దీవెన తీసుకొచ్చామన్నారు.  ఈ పథకంతో 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 703 కోట్లు జమ చేస్తున్నామన్నారు. విద్యా దీవెన ద్వారా నాలుగేళ్లలో రూ. 10, 636 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. 


ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేదలు సామాజికంగా ఎదగాలనే నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు సీఎం జగన్. తరాల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే మార్గమని తెలిపారు. జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలంటే విద్యతోనే సాధ్యమని పేర్కొన్నారు.  


జనవరి – మార్చి త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు రూ.703 కోట్లు ముఖ్యమంత్రి జమచేశారు. ఇప్పటి వరకూ విద్యా దీవెన పథకం కోసం పెట్టిన ఖర్చు రూ.14,912.43 కోట్లు అని సీఎం చెప్పారు.


’’మన సమాజంలో పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆ కుటుంబాల తలరాతలు మారాలి. వారు పేదరికం నుంచి బయటకు రావాలి. ఆ కుటుంబాలనుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు లాంటి వారు రావాలి. పేదరికం అనే సంకెళ్లను వారు తెంచుకోవాలి. దానికి చదువులు ఒక్కటే మార్గం. అందుకే నాలుగేళ్ల ప్రభుత్వ పాలనలో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ వాడిగా అడుగులేశాం. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు సామాజికంగాను, ఆర్థికంగానూ గట్టిగా నిలబడాలంటే, వారు వివక్ష సంకెళ్లను తెంచుకోవాలంటే.. దానికి చదువులు ఒక్కటే మార్గం. 


ఒక అంబేడ్కర్‌, ఒక సావిత్రీ పూలే కాని, మౌలానా అబ్దుల్‌ ఆజాద్‌ కాని, వారి నోట్లోనుంచి వచ్చిన మాట ఏంటంటే.. చదువు అనేది ఒక్క అస్త్రం అని. అలాంటి చదువుల విప్లవం మన రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలుగా చేపట్టాం. చదువులు అన్నవి పేదలకు ఒక హక్కుగా అందాలి. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలను అమలు చేస్తోంది. పూర్తి ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి త్రైమాసికంలోనూ జమచేస్తున్నాం. జనవరి-ఫిబ్రవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి ఇప్పుడు డబ్బు జమచేస్తున్నాం. లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం.


నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు - సీఎం


చంద్రబాబు ప్రభుత్వంలో అరకొరగా ఫీజులు ఇచ్చారు. రూ.1,777 కోట్ల రూపాయలు బకాయిపెట్టాడు చంద్రబాబు. ఆ డబ్బును కూడా మన ప్రభుత్వమే తీర్చింది. బోర్డింగ్‌ ఫీజులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రతి ఏటా వసతి దీవెన కింద రెండుమార్లు తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం. అక్షరాల 25 లక్షల మందికిపైగా వర్తింపు చేస్తున్నాం. కేవలం ఒక్క ఈ పథకానికే రూ.4,275.76 ఖర్చుచేశాం. చంద్రబాబు  హయాంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలి. ఫీజులు అరకొరగా ఇచ్చేవారు. ఎప్పుడు ఇచ్చేవారో తెలిసేది కాదు. ముష్టి వేసినట్టు ఇచ్చేవారు. కేవలం రూ.35 వేలు ఇచ్చేవారు. మన ప్రభుత్వం ఫీజులు ఎంతైతే అంత ఇస్తోంది.  ఇలాంటి పథకాలు ఇస్తుంటే, రాష్ట్రం దివాళా తీస్తుందని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మీడియా వ్యవస్థలు కొన్ని ఇలానే మాట్లాడుతున్నాయి’’ అని సీఎం జగన్ మాట్లాడారు.