MP Bharath : టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ పాదయాత్ర దేనికి ఉపయోగంలేదని, లోకేశ్ తో కనీసం సెల్ఫీలు ఎవరైనా దిగుతున్నారా? అని వైసీపీ ఎంపీ భరత్ ఎద్దేవా చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడి ఆయన... మంత్రి ఆదిములపు సురేష్ ఇంటిపై చంద్రబాబు రాళ్లదాడి చేయించడం దారుణం అన్నారు. దళితుల ఓట్లు కావాలి, దళిత మంత్రి ఇళ్లపై దాడి చేయిస్తారు చంద్రబాబు అని ఆరోపించారు. నాలుగేళ్ల పాటు నోరు మెదపని బీజేపీకి ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వాళ్లను వీళ్లను బలోపేతం చేసుకోడానికి బీజేపీ వైసీపీపై  బురద జల్లుతుందని ఆరోపించారు.  వైసీపీ కార్యక్రమాలపై ప్రజల నుంచి స్పందన బాగుందన్నారు. ప్రజల నుంచి స్పందన రాకపోతే ప్రజల్లోకి ఎలా వెళ్తామని ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి జగన్ రాజమండ్రి సిటీ ఇంఛార్జి విషయంలో  ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. రాజమండ్రి అర్బన్ నుంచి ఎవరిని నిలబెట్టిన గెలిపించే బాధ్యత కూడా నేనే తీసుకుంటానన్నారు.  సుమారు ఎమ్మిదిన్నర కోట్ల రూపాయలతో రాజమండ్రిలో ఫూలే భవనానికి శంకుస్థాపన చేస్తున్నామన్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల భూమిని చదును చేస్తే రైతుల ముసుగులో టీడీపీ నేతలు వచ్చి అడ్డుకుంటున్నారని ఎంపీ భరత్ మండిపడ్డారు. 


"జగన్ సీఎం అయిన నాటి నుంచి నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు లక్షల కోట్లు ఎస్సీ ఎస్టీ మైనార్టీల అకౌంట్లోకి నేరుగా జమ చేసిన ప్రభుత్వం వైసీపీ. టైమ్స్ సర్వే ప్రకారం పార్లమెంట్ ఎంపీలు 25కి 25 వస్తాయని తేలింది. అదే స్ఫూర్తితో 175/175 ముందుకు వెళ్తాం."- ఎంపీ భరత్