Daggubati Purandeswari: ఏపీలో ఎన్నికల పొత్తులపై వాడివేడీగా చర్చలు సాగుతోన్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన సాగడం ఆసక్తికరంగా మారింది.. ఈ పర్యటనలో ఏం చర్చలు జరిగాయి అనేది పక్కన పెడ్డితే.. ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ కలిశారని.. అదే విధంగా ప్రతిపక్ష నేత హోదాలో కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిశారని తెలిపారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.  ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. తాము ప్రస్తుతానికి జనసేనతో పొత్తులో ఉన్నామన్నారు. 


22న తేదీన నెల్లూరుకు శివరాజ్ సింగ్ చౌహాన్ రాక                                     


నెల్లూరులో మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి ఈ నెల 22న మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నెల్లూరుకు వస్తున్నారని తెలిపారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది.. అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోంది.. ఇసుక దోపిడీ పై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది.. ప్రస్తుతం విచారణ జరుగుతోందన్నారు. ప్రభుత్వంపై ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారని తెలిపారు.. కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధులను రాష్ట్రం పక్కదారి పట్టించింది అని ఆరోపించారు పురంధేశ్వరి.. ఈ విషయాన్ని కేంద్రం ప్రభుత్వ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చింది.. నిధుల వినియోగంపై యూటిలిజెషన్ సర్టిఫికెట్ అడిగారని తెలిపారు.  


లిక్కర్ మాఫియాపైనా  విచారణకు ప్రయత్నం                              


తిరుపతి ఉప ఎన్నికల్లో వై.సి.పి. నేతలు 35 వేల దొంగ ఓట్లను చేర్చించారని.. దీనిపై విచారణ చేసి బాధ్యుల పై చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఎలాంటి అవకతవకలు జరగలేదని రెవెన్యూ.. పోలీస్ అధికారులు నివేదిక ఇచ్చారు.. దీనిపై కూడా విచారణ జరుగుతోందన్నారు.   రాష్ట్రంలో లిక్కర్ మాఫియా పేట్రేగిపోతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు పురంధేశ్వరి.. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వేసిన రహదారులు బాగున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రహదారులను పట్టించుకోవడం లేదన్నారు. సొంత ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తోంది.. అందుకే పట్టాను కూడా లబ్ధిదారులు చించేస్తున్నారన్నారు. 


రైతుల్ని ప్రభుత్వం ఆదుకోలేదు           


ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతుల బీమా ని ప్రభుత్వం చెల్లించలేదు.. అందుకే రైతులు తీవ్రంగా నష్టపోయారు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయన్నారు. ఎన్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగాయి. డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబును ముఖ్యమంత్రి పక్కన పెట్టుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారని విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో గట్టి నిర్ణయాలు తీసుకుంటోంది.. అందుకే 370 ఆర్టికల్ రద్దు.. రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేసిందని గుర్తు చేశారు.