YS Viveka Case :    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ వాంగ్మూలాన్ని పులివెందుల కోర్టు నమోదు చేసింది.  మేజిస్ట్రేట్ ముందు తులసమ్మ వాంగ్మూలం ఇచ్చారు. వివేకా కేసులో మరో ఆరుగురుని సీబీఐ విచారించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో తులశమ్మ పిటిషన్ వేశారు.    వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, బావమరిది శివ ప్రకాష్‌రెడ్డి, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, బీటెక్ రవి, రాజేశ్వర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌లను సీబీఐ విచారించే విధంగా ఆదేశించాలని కోరింది. తులసమ్మ పిటిషన్‌పై 9 నెలల తర్వాత పులివెందుల కోర్టు వాంగ్మూలం నమోదు చేసింది.


పులివెందుల కోర్టులో వేసిన పిటిషన్‌లో పలు విషయాలను పేర్కొన్న తులశమ్మ 
  
వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబ, రాజకీయ వారసత్వం కోసం నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి ఈ హత్యకు కుట్ర పన్నారని తులశమ్మ ఆరోపిస్తున్నారు.  పులివెందులలో వివేకా రాజకీయ ప్రత్యర్థి బీటెక్‌ రవి అందులో భాగస్వామి అయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు. భూ వివాదాలతో వివేకాపై కక్ష పెంచుకున్న ఆయన మాజీ అనుచరుడు కొమ్మా పరమేశ్వరరెడ్డి, రాజకీయంగా విభేదాలున్న వైజీ రాజేశ్వరరెడ్డితోపాటు నీరుగుట్టు ప్రసాద్‌ అందుకు సహకరించారని  పిటిషన్‌లో వివరించారు.  వారందరినీ నిందితులుగా చేర్చి కేసు దర్యాప్తు చేయాలని కోరారు. తన  కుటుంబ సభ్యుల పాత్ర బయటపడుతుందనే వివేకా భార్య సిట్‌ దర్యాప్తును అడ్డుకున్నారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఆ విషయాలను సీబీఐ ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తూ అమాయకులను ఇరికిస్తూ దర్యాప్తును తప్పుదారి పట్టిస్తోందని పిటిషన్‌లో ఆరోపించారు. 


వివేకానందరెడ్డి రెండో పెళ్లితో కుటుంబంలో  గొడవలు వచ్చాయన్న తులశమ్మ 


వైఎస్‌ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే హత్యకు దారి తీశాయని తులశమ్మ చెబుతున్నారు.  షమీమ్‌ అనే మహిళను ఆయన 2010లో రెండో పెళ్లి చేసుకోగా వారికి 2015లో ఓ కుమారుడు కూడా జన్మించారని తలుశమ్మ కోర్టుకు తెలిపారు.  వివేకా భార్య సౌభాగ్యమ్మ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని కుమార్తె సునీత నివాసంలో ఉంటున్నారని.. రెండో భార్య షమీమ్, ఆమె కుమారుడికి కొంత ఆస్తి రాసివ్వాలని వివేకానందరెడ్డి భావించారని తులశమ్మ తెలిపారు.  షమీమ్‌ కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని చెప్పడం వివేకా కుటుంబ సభ్యులు చాలాసార్లు షమీమ్‌ ఇంటికి వెళ్లి ఆమెను తీవ్రంగా బెదిరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.  


అల్లుడే హత్య చేయించారని తులశమ్మ ఆరోపణ ! 
    
వివేకా హత్య కేసులో పలువురి కాల్‌ డేటాలు, సీసీ టీవీ ఫుటేజీలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సిట్‌ బృందాలు సేకరించాయి. ఆ కేసును దాదాపు ఓ కొలిక్కి తెచ్చేందుకు సిద్ధమైన తరుణంలో సిట్‌ దర్యాప్తును అడ్డుకుంటూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని తులశమ్మ ఆరోపిస్తున్నారు.  హత్య వెనుక తన కుటుంబ సభ్యుల పాత్ర బయటపడుతుందనే ఆమె సిట్‌ దర్యాప్తును అడ్డుకున్నారని అంటున్నారు.  కేసుకు సంబంధించి సిట్‌ బృందాలు గతంలో నమోదు చేసిన కేస్‌ డైరీలు రెండింటిని న్యాయస్థానం తెప్పించుకోవాలని పిటిషన్‌లో తులశమ్మ కోరారు. తన పిటిషన్‌లో ఉన్న దాన్నే కోర్టు ముందు తులశమ్మ వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.