Ganta And Son arrest : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును కూడా సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారన్న కారణంగా ఆయనతో పాటు ఆయన కుమారుడ్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలను ఇంకా సీఐడీ బయట పెట్టాల్సి ఉంది. 


 


గతం సీఐడీ నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా గంటా పేరు రాలేదు. అయితే అనూహ్యంగా ఆయన కుమారుడిని కూడా అరెస్ట్ చేయడంతో సీఐడీ కొత్త కేసును నమోదు చేసినట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


గతంలో నమోదు చేసిన స్కిల్ స్కాంలో ఉన్న వివరాలు ఇవి 


కేసులో అప్పటి ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ–సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌గా వ్యవహరించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎస్‌డీఈఐ కార్యదర్శికి ఓఎస్డీగా ఉన్న నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, ఇతర అధికారులు, సీమెన్స్, డిజైన్‌ టెక్, స్కిల్లర్, ఏఐసీ తదితర కంపెనీలకు చెందిన అప్పటి ఎండీలు, ఇతర ప్రతినిధులతో సహా మొత్తం 26 మందిపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. డిసెంబర్ 11, 2021న సీఐడీ గంటా సుబ్బారావును హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. దాదాపుగా ఇరవై రెండు నెలల తర్వాత ఇప్పుడు అదే కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు.   2014–19లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలు కలిపి మొత్తం 40 చోట్ల ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందుకోసం రూ.3,611.05 కోట్లతో సీమెన్స్, డిజైన్‌టెక్‌ సంస్థలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 90 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలి. ఈ మేరకు 2017 జూన్‌ 30న జీవో 4ను టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది.  కానీ జీవో 4కు విరుద్ధంగా ఒప్పందం చేసుకునేలా ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీ నారాయణ, ఎండీ–సీఈవోగా ఉన్న గంటా సుబ్బారావు చక్రం తిప్పారని సీఐడీ ఆరోపించింది.  రూ.100 స్టాంప్‌ పేపర్‌పై ఒప్పందం చేసుకున్నారు. అందులో తేదీ కూడా వేయలేదని సీఐడీ చెప్పింది.  రూ.3,611.05 కోట్ల విలువ మేరకు కాంట్రాక్టును ఎలా నిర్ధారించారన్నదీ కూడా లేదని సీఐడీ చెబుతోంది. సీమెన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థలు సమకూర్చాల్సిన 90 శాతం నిధులను ఏ విధంగా లెక్కించారన్నదీ చెప్పనే లేదు. సంబంధిత మొత్తం వేయాల్సిన చోట ఖాళీగా వదిలేశారని సీఐడీ ఆరోపించింది.   జీవో ప్రకారం 90 శాతం నిధులు వెచ్చించాలన్న విషయాన్ని సీమెన్స్, డిజైన్‌ టెక్‌ కంపెనీలు పట్టించుకోలేదు. అయినా సరే ప్రభుత్వం మాత్రం తన వాటాగా చెల్లించాల్సిన 10 శాతం నిధులను జీఎస్టీతో సహా మొత్తం రూ.371 కోట్లు చెల్లించేసింది. అసలు పనులు చేయకుండానే నిధులు ఎలా చెల్లిస్తారని అప్పటి ఆడిట్‌ అకౌంటెంట్‌ జనరల్‌ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించు కోలేదని సీఐడీ ఆరోపించింది. 


షెల్ కంపెనీల ద్వారా చేతులు మారాయన్న సీఐడీ 


ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అందుకోసం ఢిల్లీ కేంద్రంగా ‘స్కిల్లర్‌’ అనే షెల్‌ కంపెనీని సృష్టించారని సీఐడీ ఆరోపించింది.  ఆ కంపెనీకి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ సరఫరా కోసం రూ.241 కోట్లకు సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు చూపించారన్నారు.  ఆ ‘స్కిల్లర్‌’ కంపెనీ ముంబయిలోని ‘అలైడ్‌ కంప్యూటర్స్‌ ఇంటర్నేషనల్‌ (ఏఐసీ) అనే మరో షెల్‌ కంపెనీకి వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చినట్టుగా  చూపించారని..  ఆ మేరకు ఏపీఎస్‌ఎస్‌డీసీకి సాఫ్ట్‌వేర్, హార్ట్‌వేర్‌ సరఫరా చేసినట్టుగా ఏసీఐ కంపెనీ నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించిందని సీఐడీ ఆరోపమ.  ఢిల్లీకి చెందిన పాట్రిక్స్‌ ఇన్ఫో సర్వీసెస్, ఇన్‌వెబ్‌ ఇన్ఫో సర్వీసెస్, అరిహంట్‌ ట్రేడర్స్, జీఏ సేల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే షెల్‌ కంపెనీలు తెరపైకి వచ్చాయని చెప్పారు.   ఆ నకిలీ ఇన్‌వాయిస్‌ల ఆధారంగా రూ.241 కోట్లు ఏసీఐకి చెల్లించారని..   దాన్నుంచి ఏసీఐ కంపెనీ తన 5 శాతం కమిషన్‌ను తగ్గించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఢిల్లీలోని డిజైన్‌ టెక్‌ కంపెనీకి చెల్లించిందని సీఐడీ చెబుతోంది.  


అయితే వీటన్నిటిలో చంద్రబాబుకు. గంటాకు సంబంధం ఏమిటన్నది సీఐడీ చూపించాల్సి ఉంది.