Nellore News: నెల్లూరులో ఈ రోజు (ఏప్రిల్ 17) జరగబోతున్న మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి (Kakani Goverdhan Reddy) స్వాగత ర్యాలీ, అదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో తలపెట్టిన కార్యకర్తల సభపై అధిష్ఠానం దృష్టి సారించింది. పోటా పోటీగా ఈ రెండు కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇప్పటికే మాటల తూటాలు పేలాయి, ఫ్లెక్సీలు చిరిగాయి. దీనికి సంబంధించి గొడవ జరిగే అవకాశం ఉండటంతో బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజీ ప్రయత్నం జరిగినట్టు సమాచారం. 


సిటీ వరకే అనిల్ సభ.. 
అనిల్ కుమార్ యాదవ్ సభ సాయంత్రం 4 గంటలకు ఉంది. రాత్రి వరకు అది జరిగే అవకాశం ఉంది. కార్యకర్తలతో మీటింగ్ అనుకున్నారు కానీ, అది నగరం నడిబొడ్డున గాంధీ బొమ్మ సెంటర్ లో పెట్టుకున్నారు. ఈ సభ వల్ల కాకాణి ర్యాలీ నెల్లూరు టౌన్ లోకి ఎంటరయ్యే అవకాశం లేదు. గతంలోనే ఈ సభకు ఏర్పాట్లు చేసుకున్నానని, పర్మిషన్ కూడా తీసుకున్నానని అనిల్ చెప్పడంతో సభ వరకు అధిష్ఠానం ఓకే చెప్పింది. అయితే సిటీ వరకే సభను పరిమితం చేసుకోవాలని సూచించారట!


మినీ బైపాస్ లో కాకాణి ర్యాలీ.. 
మంత్రి పదవి వచ్చిన తర్వాత తొలిసారిగా నెల్లూరు జిల్లాకు వస్తున్న కాకాణి గోవర్దన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే జిల్లా నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. కావలి నియోజకవర్గం నుంచి బైక్ ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత నెల్లూరు నగరంలో కూడా కాకాణి ర్యాలీ ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అనిల్ సభతో అది కుదిరేలా లేదు. దీంతో కాకాణి ర్యాలీని మినీ బైపాస్ రోడ్డుకి పరిమితం చేయబోతున్నారు. మినీ బైపాస్ పై కాకాణి ర్యాలీగా వచ్చి తన ఇంటికి వెళ్తారు.


రాజీ కుదిరినట్టేనా..?
మాజీ మంత్రి, తాజా మంత్రి మధ్య రాజీ కుదిరినట్టు కనిపించట్లేదు కానీ.. ఈ రోజు వరకు ఒకరి వల్ల ఇంకొకరి కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుంది. నెల్లూరులో ఇద్దరు నేతల కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఒకరి కార్యక్రమానికి ఇంకొకరు అడ్డు తగలకుండా ఉండాలని సూచించారు.


పోలీసు బందోబస్తు.. 
మరోవైపు, రెండూ అధికార పార్టీ నేతల కార్యక్రమాలు కావడంతో పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. రెండు కార్యక్రమాల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు పెంచింది.