Nellore Deadbody on Bike:  తిరుపతి రుయా ఆస్పత్రిలో ఇటీవల కొడుకు మృతదేహాన్ని తరలించడానికి తండ్రి పడిన అవస్థ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొడుకు మృతదేహాన్ని భుజానికి ఎత్తుకుని 90 కిలోమీటర్లు బైక్ పై వెళ్లాడు తండ్రి. ఈ దారుణ ఘటన తర్వాత ప్రైవేట్ ఆంబులెన్స్ ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ఇలాంటి సంఘటనే నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో జరిగింది. 108 సిబ్బంది నిబంధనలు అంగీకరించవంటూ నిరాకరించడంతో చేసేదేం లేక శవాన్ని బంధువులు బైక్ పై తరలించారు. ఈ సంఘటనతో అక్కడున్నవారు కంటతడి పెట్టారు. 


నెల్లూరు జిల్లా సంగంలో శ్రీరామ్‌ (8), ఈశ్వర్‌ (10) అనే ఇద్దరు పిల్లలు బహిర్భూమికి వెళ్లి కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. ఈశ్వర్‌ మృతదేహాన్ని కాలువవద్ద నుంచి నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. శ్రీరామ్‌ ను నీటిలో నుంచి బయటకు తీసిన తర్వాత ప్రాణాలున్నాయనే ఆశతో స్థానికులు, బంధువులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే శ్రీరామ్ మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు. కొంతసేపటికి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి 108 వాహన సిబ్బంది సహాయం అడిగారు బంధువులు. అయితే నిబంధనల మేరకు శవాలను 108లో తరలించలేమని సిబ్బంది చెప్పారు. దగ్గరలో మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేదు, ఆటోవాళ్లు కూడా రాలేమన్నారు. దీంతో బైక్ పైనే ఆ అబ్బాయి మృతదేహాన్ని తరలించారు. 


బుధవారం ఉదయం శ్రీరామ్, ఈశ్వర్, యశ్విత అనే బాలిక ముగ్గురూ కలసి వారి ఇంటికి సమీపంలోనే ఉన్న కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ వద్దకు వెళ్లారు. యశ్విత గట్టుపై ఉండగా ఇద్దరు పిల్లలు కాలువలోకి దిగారు. అక్కడ బాగా లోతుగా ఉండటంతో నీట మునిగి గల్లంతయ్యారు. గట్టు మీదనే ఉన్న యశ్విత ఇంటికి వెళ్లి పెద్దలకు విషయం చెప్పడంతో వారు వెంటనే వెళ్లి గాలించారు. మొదట శ్రీరామ్ దొరకడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు, అయితే ఆలోపే అతను చనిపోయినట్టు చెప్పారు. ఆ తర్వాత ఈశ్వర్ మృతదేహం బయటపడింది.



బెంగళూరు నుంచి వచ్చి.. 
శ్రీరామ్ కుటుంబ సభ్యులతో కలసి బెంగళూరులో ఉండేవాడు. అక్కడే చదువుకుంటున్నాడు. శ్రీరామ్ తండ్రి  తండ్రి దారా వెంకటేశ్వర్లు కుటుంబానికి సంగం పెన్నా తీరంలో ప్రభుత్వమిచ్చిన భూమిలో వేరుసెనగ సాగు చేశారు. అందులో కాయలు కోసేందుకు వృద్ధులైన తల్లిదండ్రులకు సాయంగా ఉండేందుకు వెంకటేశ్వర్లు మంగళవారం సంగం గ్రామానికి వచ్చారు. వేసవి సెలవులు కావడంతో శ్రీరామ్ కూడా తండ్రితో కలసి వచ్చాడు. వెంకటేశ్వర్లు పొలానికి వెళ్లగా.. శ్రీరామ్‌ తమ ఇంటికి ఎదురుగా ఉన్న ఈశ్వర్‌తో కలిసి కాలకృత్యాలు తీర్చుకునేందుకు కాల్వ వద్దకు వెళ్లు కన్నుమూశాడు.