Nellore News : నెల్లూరులో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన మనుషుల్ని విడిపించుకుని వెళ్లిన ఘటన తెలిసిందే. వేణుగోపాల స్వామి దేవస్థానానికి చెందిన భూముల్ని కొంతమంది ఆక్రమించుకున్నారని, ఆ ఆక్రమణలు తొలగిస్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదని అన్నారు రామనారాయణ రెడ్డి. ఎస్పీ విజయరావు కూడా నేరుగా పోలీస్ స్టేషన్ కి రావడం, ఆనంకి సర్దిచెప్పడంతో వ్యవహారం సద్దుమణిగిందని అనుకున్నారంతా.  కానీ మరుసటి రోజే గిరిజనుల ఆధ్వర్యంలో నెల్లూరులో భారీ ర్యాలీ జరిగింది. దేవస్థానం సిబ్బంది తనను బూతులు తిట్టారని, తనకి న్యాయం జరగాలని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాల్సిందేనని డిమాండ్ చేసింది. మహిళకు మద్దతుగా గిరిజన సంఘాలన్నీ ఏకమై నెల్లూరులో ర్యాలీ చేశాయి



నెల్లూరు రూరల్ పరిధిలో


 గిరిజన మహిళ టిఫిన్ బండి పెట్టుకున్న ప్రాంతం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అక్కడ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం రసవత్తరంగా మారింది. నేరుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోక్యం చేసుకోకున్నా.. గిరిజనుల ర్యాలీకి వారి పరోక్ష మద్దతు ఉందని అంటున్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం ఇప్పుడు నెల్లూరులో హాట్ టాపిక్ గా మారింది. గిరిజన మహిళకు న్యాయం చేయాలంటే ఆనంకి కోపం వస్తుంది, ఆనం మనుషుల్ని సేవ్ చేయాలంటే.. ఇక్కడ మరో ఎమ్మెల్యేకి ఆగ్రహం తెప్పించినట్టవుతుంది. దీంతో పోలీసులు మింగలేక, కక్కలేక అన్నట్టుగా అవస్థలు పడుతున్నారు.  


 పోలీసులపై ఆనం ఫైర్  


నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పోలీస్ స్టేషన్లో సీఐకి కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. వేణుగోపాల స్వామి దేవస్థానం ఛైర్మన్, సిబ్బందిని విచారణకు పిలిపించి గంటల సేపు స్టేషన్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. దేవస్థానం భూముల్లో కొంతమంది గుడిసెలు వేసుకుని ఆక్రమణకు పాల్పడ్డారని, వారి గుడిసెలను సిబ్బంది తొలగించారని, ఇది తప్పా అని ప్రశ్నించారు. గిరిజనులు అక్కడ గుడిసెలు వేసుకుని టిఫిన్ బండి పెట్టుకుని నడుపుతున్నారు. ఈ క్రమంలో దేవస్థానం సిబ్బంది ఆ గుడిసెలను తొలగించడంతో వివాదం మొదలైంది. గుడిసెలు వేసుకున్న గిరిజనులు దేవస్థానం సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని పోలీసులు స్టేషన్ కి పిలిపించారు. దేవస్థానం సిబ్బంది తరపున ఎమ్మెల్యే ఆనం నేరుగా ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి హల్ చల్ చేశారు. ఆనం రాకతో వెంటనే అడిషనల్ ఎస్పీ హిమవతి అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆనం.. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పోలీస్ వ్యవస్థ ఉండటం దారుణం అని అన్నారు. ఆలయ భూముల ఆక్రమణకు పోలీసులు వత్తాసు పలకడం ఏంటని ప్రశ్నించారు. 
 


Also Read : Darapaneni Narendra: దారపనేని నరేంద్రకు బెయిల్, ఝండూబామ్ రాసి మరీ కొట్టారని ఆరోపణలు