తెలుగు దేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రకు బెయిల్ మంజూరైంది. విజయవాడ ఎయిర్‌ పోర్టులో బంగారం స్మగ్లింగ్‌ విషయంలో ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. స్మగ్లింగ్ కు సంబంధించి సీఎంవోలోని ఓ కీలక అధికారికి సంబంధం ఉందని నరేంద్ర వాట్సాప్‌ గ్రూపులో పోస్టులు ఫార్వర్డ్‌ చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కారణంతోనే నరేంద్రను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గుంటూరు సీఐడీ రీజినల్ ఆఫీసుకు తరలించారు. అనంతరం దారపనేని నరేంద్రకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫున న్యాయవాదులు ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆయనకు బెయిల్ మంజూరు అయింది. 


అంతకుముందు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు చేసి అర్ధరాత్రి రెండు గంటలకు న్యాయమూర్తి వద్ద సీఐడీ పోలీసులు హాజరు పరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, నరేంద్రకు రిమాండ్ తిరస్కరించారు. బెయిల్ ఇవ్వడంతో దారపనేని నరేంద్రను విడుదల చేశారు పోలీసులు. నరేంద్రకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇవ్వలేదని లాయర్లు వాదనలు వినిపించారు. ఇదే కేసులో ఇంతకుముందు అరెస్టు అయిన కొల్లు అంకబాబు రిమాండును కోర్టు తిరస్కరించి.. దర్యాప్తు అధికారికి షోకాజ్‌ నోటీసు జారీ చేసిన విషయాన్ని లాయర్లు గుర్తు చేశారు.


రిమాండ్ ఇవ్వకపోతే విచారణకు ఆటంకం - సీఐడీ తరపు లాయర్
దారపనేని నరేంద్ర అమరావతి పేరుతో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి అందులో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని సీఐడీ తరపు లాయర్ వాదించారు. ఆయనకు బాగా పలుకుబడి ఉందని, అలాంటి వ్యక్తికి బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని వివరించారు. కానీ నరేంద్రకు అనుకూలంగానే న్యాయమూర్తి బెయిల్ మంజూర్ చేశారు. 


సీఐడీ అధికారులపై నరేంద్ర ఆరోపణలు
తనను సీఐడీ అధికారులు కొట్టారని నరేంద్ర జడ్జి ముందు ఆరోపించారు. దెబ్బలు కనిపించకుండా కొట్టారని, ఝండూబామ్‌ రాసి మరీ భౌతిక దాడులు చేశారని నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సీఐడీ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడబోదని అధికారులు సమర్థించుకున్నారు.


నరేంద్ర భార్య లేఖ
నరేంద్రను అరెస్టు చేయడంపై ఆయన భార్య సౌభాగ్యం హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు దౌర్జన్యంగా తీసుకెళ్లారని ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నించగా, సీఐడీ పోలీసులమని చెప్పారని లేఖ రాశారు. ఆయన చేసిన నేరం ఏంటో కూడా చెప్పకుండా ఇంట్లోకి చొరబడి ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అర్ధరాత్రి ఎవరి ఇంట్లోకైనా చొరబడే హక్కు పోలీసులకు లేదని లేఖలో అన్నారు.


తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలు


గన్నవరం విమానాశ్రయంలో ఇటీవలే వెలుగు చూసిన బంగారం స్మగ్లింగ్ కేసులో తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు సోషల్ మీడియాలో షేర్‌లు చేసినందుకు నరేంద్రను ఏపీసీఐడీ అధికారులు బుధవారం సాయంత్ర అరెస్టు చేశారు. ఇదే కేసులో సీనియర్ జర్నలిస్ట్ అంకంబాబును గతంలో అరెస్టు చేశారు. ఈ అంశంపైనే నరేంద్రను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంకంబాబుకు ఆ పోస్టు ఎవరు పంపించాలో చెప్పాలన్నారని తెలుస్తోంంది.


ఈ అరెస్టుపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్రను సిఐడి పోలీసులు అరెస్టు చెయ్యడాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సిఐడి పోలీసుల తీరుమారడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఇదే కేసులో జర్నలిస్ట్ అంకబాబు అరెస్టును కోర్టు తప్పు పట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పార్టీ కార్యాలయంలో పని చేసే వారిని అరెస్టు చేసి భయపెట్టాలనే సిఎం జగన్ వైఖరిని ఖండించారు.