ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక సమస్యలతో పాటు కోర్టు కేసులతోనూ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వంపై అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టులలో కలిపి కనీసం ఒక లక్షా 94వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపుగా ప్రతీ రోజు మరో 450 పిటిషన్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో దాఖలవుతున్నాయి. ఇన్ని కేసులు ఉండటం వాటిపై విచారణకు హాజరవడం.. కౌంటర్లు దాఖలు చేయడం వంటి పనుల వల్ల అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. కోర్టు నోటీసులకు కౌంటర్ల దాఖలు చేయకపోవడం వల్ల అది కోర్టు ధిక్కార కేసుగా రూపాంతరం చెందుతోంది. ఈ కేసులకు సంబంధించిన పేపర్‌వర్క్ భారం ఉద్యోగులపై పడుతోంది. ఫలితంగా పాలనా వ్యవహారలపై ప్రభావం చూపుతోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.  


"  కనీసం నలభై వేల పేజీల పేపర్ వర్క్ చేయాల్సి వస్తోంది. కొత్తగా దాఖలు చేస్తున్న పిటిషన్‌లు.. విచారణలో ఉన్న పిటిషన్లకు సంబంధించిన వర్క్ మాత్రమే ఇది. దీని వల్ల ఎంత పనిభారం ఉందో అర్థం చేసుకోవచ్చు "  - ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి 


8వేలకుపైగా కోర్టు ధిక్కార కేసులు..!

దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపినప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. వాటిని అమలు చేయడం విఫలమైతే కోర్టు ధిక్కారం కింద పిటిషన్లు వేస్తున్నారు. దీంతో అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇలా మొత్తంగా ఎనిమిది వేల కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయని ఇటీవల ఉన్నతాధికారులు లెక్కలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇటీవల ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ప్రత్యేకంగా పెండింగ్ కేసుల అంశంపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో కోర్టు ధిక్కార కేసులో 8వేలు ఉన్నట్లుగా తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కోర్టు ధిక్కరణ కేసుల్లో తక్షణం స్పందించి హైకోర్టుకు వివరణ ఇవ్వడం కౌంటర్ దాఖలు చేయడం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పట్టించుకోకపోవడం వల్ల పదే పదే హాజరవ్వాలని ఆదేశాలు వస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ప్రస్తుత ప్రభుత్వంపై మాత్రమే కాదు .. గత ప్రభుత్వాలపై దాఖలైనవి కూడా..!


అయితే ఈ కేసులన్నీ ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రమే వచ్చినవి కావు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు కూడా. దశాబ్దాల కిందటి నాటి కేసులు కూడా ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి. ఇరవై ఏళ్ల కిందటి కేసులు కూడా ఉండటం చూసి రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ వీణా ఇష్ ఆశ్చర్యపోయారు. విచిత్రం ఏమింటటే రికార్డుల్లో ముగిశాయి అని రాసిన కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.  ఫైళ్లు పోయినకారణంగా కోర్టుకు సరైన సమాధానాలు చెప్పలేని కారణంగా వాటిని ఇప్పటికి పెండింగ్ స్టేజ్‌లోనే ఉంచుతున్నారు. ముగించలేకపోతున్నారు.  


"కేసులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి, తదుపరి చర్యలను ప్రారంభించడానికి సరైన యంత్రాంగం లేదు. అది చాలా సందర్భాలలో ధిక్కార పిటిషన్లకు కారణం అవుతోంది "  ఏపీ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి




కోర్టు కేసులను పర్యవేక్షించే సరైన వ్యవస్థ లేకపోవడమే కారణం..!


కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు చూసి ఆ అధికారి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ ఉత్తర్వులను చాలా కాలం క్రితమే అమలు చేశారు. ఆ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఈ పరిస్థితే ప్రభుత్వం ఎంత గందరగోళ స్థితిలో ఉందో తెలుస్తుందని ఆ అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 


కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఉన్నతాధికారులు



 ఇటీవలి కాలంలో కోర్టు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉపాధి హామీ పనుల బిల్లులతో పాటు ఇతర బిల్లుల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఆలస్యం చేస్తూండటంతో అందరూ కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. వారికి చెల్లింపులు చేయాలని హైకోర్టు ఆదేశిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం చేయడం లేదు. ఈ కారణంగా అదికారులు కోర్టు ముందు హాజరు కావాల్సిన పరిస్థితి వస్తోంది. రాజకీయంగా తప్పు జరుగుతోందని.. కానీ అధికారులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయం సచివాలయంలో వినిపిస్తోంది. ఒక్క ఆర్థిక శాఖలోనే ఇటీవలి కాలంలో 143 కోర్టు ధిక్కార కేసులను అధికారులు ఎదుర్కొంటున్నట్లుగా తేలింది
 
చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాత్ దాస్ సహా అనేక మంది కోర్టు ధిక్కారణ కేసుల్లో కోర్టులకు హాజరవుతున్నారు. కొంతమంది  హైకోర్టుకు హాజరై ఆ తర్వాత విధులకు వెళ్తున్నారు. " మాకు ఇదో టీవీ సీరియల్‌లా" మారిపోయిందని కొంత మంది అధికారులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
( పీటీఐ )