NTR Bharosa Pensions : ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పింఛన్ల సొమ్ము ఒకటో తారీఖున లబ్ధిదారులకు అందజేయనున్నారు. సత్యసాయిజిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) నేరుగా పింఛన్‌సొమ్ము ఇవ్వనున్నారు


పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకటో తారీఖునే పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వరుసగా రెండోనెల కూడా పెంచిన పింఛన్లు  మొత్తం లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ మేరకు ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా(NTR Bharosa) సామాజిక పింఛన్ల కోసం ప్రభుత్వం 2వేల 737 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 64లక్షల 82 వేల మంది లబ్ధిదారులకు గురువారం ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. యథావిధిగా సచివాలయ ఉద్యోగుల ద్వారానే పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు.


ఉదయమే ఇళ్లవద్దకు వచ్చి నేరుగా పింఛన్లు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ, వార్డు , సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి తొలిరోజే దాదాపు పింఛన్ల సొమ్ము మొత్తం అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఒకటీ, అరా మిగిలిపోతే మరుసటి రోజు కల్లా పూర్తిస్థాయిలో పింఛన్ల పంపిణీ పూర్తి కావాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌ సొమ్ము పెంచింది. ఆ మేరకు వృద్ధులు, వితంతువులకు  4వేల రూపాయలు, దివ్యాంగులకు 6 వేల రూపాయలు పింఛన్‌ సొమ్మ అందజేయనున్నారు.


నేరుగా అందించనున్న సీఎం
పెంచిన ఫించన్ల సొమ్మును వరుసగా రెండోనెల కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) నేరుగా ఇంటికి వెళ్లే అందజేయనున్నారు. గురువారం సత్యసాయి(Satya SaI) జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. ఆ మేరకు మడకశిర(Madakasira) మండలం గుండుమలలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోనున్న సీఎం చంద్రబాబు...అక్కడికక్కడే వారికి పింఛన్‌ సొమ్ములు అందజేయనున్నారు. అనంతరం అక్కడే మల్బరీ నాట్లు, పట్టుపురుగుల షెడ్లను సీఎం పరిశీలించనున్నారు. ఆ తర్వాత  కరియమ్మదేవి ఆలయాన్ని సందర్శించి చంద్రబాబు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు అనంతపురం జిల్లా రానుండటంతో నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. అధికారులు సైతం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.


ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా మడకశిర నియోజకవర్గంలోని గుండుమలలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటున్నారని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లును, హెలిపాడ్, తిరిగే ప్రదేశాలను పయ్యావుల కేశవ్ పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ" ప్రతి నెల 1 తేదీన జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పాల్గొని గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమాలలో పాల్గొంటారు. గ్రామ సమస్యలు పరిష్కరించడానికి ప్రజా వేదిక నిర్వహిస్తారు. ఆయా గ్రామల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని పరిష్కార మార్గాలు సూచిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాత్ర ఎక్కువగా ఉంటుంది. గ్రామాల మధ్యలో, బడి పక్కన, గుడి పక్కను, ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలి, గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి ఈ వేదిక మంచి ఫలితాలు ఇస్తుంది" అని పయ్యావుల పేర్కొన్నారు.


కృష్ణమ్మకు వందనం
ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదిలో వరద పోటెత్తుతోంది. దీంతో ఈ సీజన్‌లో ఆశాజకంగానే జలాశయాలు నిండాయి. దీంతో పెద్దఎత్తున వరద నీరు శ్రీశైలం (Srisailam) జలాశయానికి పోటెత్తడంతో పదిగేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ బిరబిర పరుగులు పెడుతుంటే రైతుల కళ్లల్లో ఆనందం తాండవిస్తోంది. ఖరీప్‌ సీజన్‌ ఆరంభంలోనే అటు శ్రీశైలంతోపాటు నాగార్జునసాగర్‌ నిండే అవకాశాలు ఉంది. రాష్ట్రంపై కరుణించి కృష్ణమ్మకు సారె సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శ్రీశైలం రానున్నారు. మల్లన్న దర్శనం అనంతరం శ్రీశైలం డ్యాం పరిశీలించి కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అయితే శీశైలం జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద స్వల్పంగా తగ్గింది. అయిప్పటికీ నాగార్జునసాగర్‌కు నీటి విడుదలను యథాతథంగా కొనసాగిస్తున్నారు