కరవు నేలలో సిరులు కురిపిస్తోంది గులాబీ పూల సాగు. ఒకప్పుడు కరవుతో విల విలవిల్లాడి నెర్రెలు చీలిన భూములతో దర్శనమిచ్చే  అనంతపురం జిల్లా భూముల్లో నేడు పండ్లు, పూల సాగుతో కోనసీమను తలపిస్తోంది.


అనంతపురంలోని  రైతులు కూడా సరికొత్త రకాల పంటలు సాగుచేస్తు ప్రయోగాలు చేసి సత్పలితాలు సాధిస్తున్నారు. అలాంటి రైతుల్లో ఒకరు కొడికొండ గ్రామానికి చెందిన అజమ్ తుల్లా.. మొదటి నుంచి సాగుచేస్తున్న కూరగాయల పంటలు కాదని ఐదు సంవత్సరాలుగా గులాబీ పూల తోట సాగు చేస్తు అధిక దిగుబడి సాధిస్తున్నారు. అంతేనా వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తూ అనంత జిల్లా పేరు విదేశాల్లో మారుమోగేలా చేస్తున్న గులాబి రైతు ఈయన. 


గులాబి పూల సాగుకు అనుకూలమైన వాతావరణం ఉండాలని ఎర్ర రేగటి నేల అయితేనే ఎక్కువ దిగుబడి వస్తుంది. అజమ్ తుల్లా భూమిలో కూడా ఎర్రమట్టి లేకపోతే ఎకరాకు 1000 ట్రాక్టర్లు ఎర్రమట్టిని తీసుకొచ్చి వేశాడు. తరువాత మేకల ఎరువు వేసి అనంతరం బెడ్డింగ్ ఏర్పాటు చేసి బెడ్డింగ్ పై రెండు వరుసల డ్రిఫ్ పైప్ లైన్ వేసుకొన్నాడు. తమిళనాడు నుంచి ఒక మొక్క 13 రుపాయలతో తెచ్చి ఎకరాకు 37 వేల గులాబి మొక్కలను 6 ఇంచుల గ్యాప్ తో నాటాడు.


మొక్కలు నాటిన 45 రోజులకు వచ్చే కాడ బలంగా ఉంటే ట్యూనింగ్ చేస్తామని లేకపోతే కాడను తుంచేస్తారు. తరువాత పది రోజులకు మొగ్గలు వస్తాయి. గులాబి పూల సాగు చాలా ఖర్చుతో కూడుకున్న పని. అజమ్ తుల్లాకు దాదాపు 45 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. ఈ గులాబి పూల సాగు చేయాలంటే 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. అందుకే ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయటానికి ఆదునిక పద్దతుల్లో పాలీహౌస్ ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి ఎకరాకు 18 లక్షలు ఖర్చు చేశాడు. ప్రభుత్వం 50 శాతం సబ్సీడీ కూడా ఇచ్చింది.


ఈ పాలీ హౌస్ ఏర్పాటు చేసినా మార్చి ఏప్రిల్ నెలలో మొక్కలకు రోజుకు రెండు సార్లు నీటిని స్ప్రే చేయాలి. వర్షం నీరు అయితేనే గులాబీ మొక్కలు గ్రోత్ బాగుంటుంది. వేరే వాటర్ అయితే ఎదుగుదల ఉండదంటున్నాడు అజమ్ తుల్లా. అందుకే మూడు నీటి కుంటలు ఏర్పాటు చేశాడు. వర్షం వచ్చినప్పుడల్లా ఆ కుంటలను నింపేస్తాడు. అక్కడి నుంచి పైప్‌లైన్‌ ద్వారా మొక్కలకు అందిస్తున్నాడు.


గులాబి పూలను మొగ్గ దశలో ఉన్నప్పుడే కట్ చేసి బంచ్ లుగా తయారు చేసి ఏసిలో పెడతారు. మరుసటి రోజే విమానాశ్రయానికి తీసుకెళ్తారు.  అక్కడ పూల వ్యాపారి స్కాన్ చేసి గులాబీ మొగ్గలను తీసుకుంటారు. అక్కడ చేసే స్కానింగ్‌లో ఆకుపై చిన్న మచ్చ ఉన్నా, పూలు స్కానింగ్ కాకున్నా ఆ పూలను రిజెక్ట్ చేస్తారు.


బెంగళురులో ఉన్న ఇంటర్నేషనల్ గులాబీ పూల మార్కెట్ కు 120 ప్రాంతాల నుంచి రైతులు పూలు తీసుకొస్తారు. అక్కడ పూల క్వాలిటినీ బట్టి గ్రేడింగ్ ఇస్తారు. గ్రేడింగ్ బట్టి పువ్వు ధర నిర్ణయిస్తారు. CKS పేరుతో శ్రీలంక, న్యూజిల్యాండ్, సూరత్, సౌదీ, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తారు. ఇలా చేసే పువ్వుల్లో అజాముల్లా గులాబీలు కూాడా ఉన్నాయి. 


అనంత జిల్లా పేరును దేశ విదేశాల్లో మారుమోగేలా చేస్తున్నాడు కొడికొండకు చెందిన అజమ్ తుల్లా. విదేశాలలో తాను పండించే గులాబీ పూలకు ఎక్కువగా డిమాండ్ ఉందన్నారు. మార్చి నెలలో తాజ్‌మహల్ రకం గులాబీ పువ్వు ఎక్కువ అమ్ముడుపోతుందన్నారు. ఒక పువ్వు 32 రెండు రుపాయలు ధర పలికిందని నార్మల్ గా రోజు ఒకపువ్వు 10 రుపాయల నుంచి  15 రుపాయల ధర పలుకుతుందన్నారు. పెళ్లిళ్ల సీజన్, ప్రేమికుల దినోత్సవం రోజున గులాబీ పూలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందన్నారు. ఇతర దేశాల నుంచి ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయి. వీళ్ల వద్ద పండే పంటకు సరిపడా ఆర్డర్స్‌నే తీసుకుంటున్నారు. ఆర్డర్స్ పెరుగుతున్న వేళ గులాబీ సాగు విస్తీర్ణం పెంచాలని ఆలోచిస్తున్నాడు  అజమ్ తుల్లా.