Ramachandra Yadav Complaint On AP CM Jagan : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy)పై సొంత నియోజకవర్గంలోనే ఫిర్యాదు నమోదైంది. సీఎం జగన్‌ అక్రమాస్తులు, అవినీతిపై.. భారతీయ చైతన్య యువజన పార్టీ (Bharatiya Chaitanya Yuvajana Party) రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్‌ చేశారు. సీఎం జగన్‌ నాలుగున్నర ఏళ్లలో లక్షా 65వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ రామచంద్ర యాదవ్‌ (Ramachandra  Yadav) ఆరోపించారు. దీనిపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పులివెందుల ఎస్సై ఉసేన్‌ను కోరారు.


2019 అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా (Kadapa District) పులివెందుల (Pulivendula) నుంచి వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గానికి గానీ, రాష్ట్రానికి గానీ చేసింది ఏమీ లేదని అన్నారు రామచంద్ర యాదవ్‌. ఈ నాలుగున్నరేళ్లలో వైఎస్‌ జగన్ రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. మద్యం,  ఇసుక, నీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు లక్షా 65వేల కోట్ల రూపాయల మేర దోపిడీ చేశారని విమర్శించారు. ఈ మేరకు పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 


సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రూ.9 వేల కోట్లు, మద్యం ద్వారా 50వేల కోట్లు, గ్రానైట్‌లో 30వేల కోట్లు, ఇసుక ద్వారా 12వేల కోట్లు, పారిశ్రామిక, చుక్కల భూముల ద్వారా 20 వేల కోట్లు, ఎర్రచందనం ద్వారా రూ.15 వేల కోట్లు, విద్యుత్‌ ఒప్పందాలు, కొనుగోళ్లతో రూ.10 వేల కోట్లు దోచుకున్నారని ఫిర్యాదు చేశారు రామచంద్ర యాదవ్‌. ఇక... పోర్టులు,  అమూల్‌, బైజూస్‌ నుంచి కమీషన్లు, సినిమా, ఇతర పరిశ్రమల నుంచి వాటాలు.. మొత్తంగా లక్షా 65 వేల కోట్లు వెనకేశారని ఆరోపించారు. వీటితోపాటు బయటకు రాని చీకటి  జీవోలు, భూముల కేటాయింపులు ద్వారా కూడా అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. వెంటనే వైఎస్‌ జగన్‌ అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రామచంద్రయాదవ్‌  తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 


వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) అవినీతి, అక్రమాలపై బహిరంగ చర్చకు కూడా తాను సిద్ధంగానే ఉన్నానంటున్నారు భారతీయ చైతన్య యువజన  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల వల్ల పులివెందులకు చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్రంలో  పరిస్థితి ఎలా ఉందంటే.. జగన్‌కు అడ్డు వస్తే హత్యలు కూడా చేయిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. వైఎస్‌ జగన్‌కు భయపడి సొంత చెల్లి, తల్లి కూడా పక్క రాష్ట్రంలో తల  దాచుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు.


వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కొట్టడానికి కూడా వెనుకాడని దుర్మార్గుడు జగన్ అని అన్నారు రామచంద్రయాదవ్‌. వైఎస్‌ జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అతను అవినీతి చేయలేదని  ఏ చర్చిలో అయినా ప్రమాణం చేసి చెప్పాలని సవాల్‌ చేశారు రామచంద్ర యాదవ్‌. జగన్‌ ప్రమాణం చేస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్‌ చేశారు.  అంతేకాదు వైఎస్‌ జగన్‌కు మద్దతు ఇస్తానని అన్నారు రామచంద్ర యాదవ్.