Kurnool News : కర్నూలును సినిమా ఇండస్ట్రీ హబ్ గా చేసేందుకు ప్రయత్నిస్తామని ప్రముఖ సినీ నిర్మాత కేఎస్ రామారావు అన్నారు. మంగళవారం కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆర్ఆర్ఆర్ సినిమాకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో సహకారం అందించారన్నారు. పెద్ద, చిన్న సినిమాలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కర్నూలులో సినిమా షూటింగ్ లకు సంబంధించి అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయన్నారు. కర్నూలులో సినిమా షూటింగ్, ఫిల్మ్ క్లబ్ ఏర్పాటుకు సినీ పెద్దలు ఆలోచించాలన్నారు.  ఉగాది పండుగ తరువాత ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సినీ పెద్దలను సంప్రదిస్తామన్నారు. కర్నూలును సినిమా ఇండస్ట్రీ హబ్ గా చేసేందుకు ముందుకు వెళ్తామన్నారు.  తుంగభద్ర నది, కేసీ కెనాల్, సమ్మర్ స్టోరేజ్, బాలసాయి స్కూల్ షూటింగ్ కు అనువైన ప్రాంతాలను గుర్తించామన్నారు. కర్నూలులో 12 ఎకరాల్లో ఫిలింసిటీ అభివృద్ధి చేసేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు.  


ఏపీలో సినిమాలు నిర్మించాలి 


ఏపీ, తెలంగాణ విడిపోయాక టాలీవుడ్ కు హైదరాబాద్ కీలకంగా మారింది. ఇక్కడే ఎక్కువ సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. విశాఖ కేంద్రంగా ఫిలింసిటీలు నిర్మిస్తామని, ఇండస్ట్రీ ఏర్పాటు చేశాలని ఇటీవల స్వయంగా సీఎం జగన్ నే అన్నారు. ఫిలింసిటీలకు స్థలాలు కేటాయిస్తానని, వాటితో పాటు జూబ్లిహిల్స్ లాంటి కాలనీలను రూపొందిస్తామన్నారు. సినిమా షూటింగ్ అనువైన ప్రదేశాలు ఏపీలో చాలా ఉన్నాయన్నారు. కొందరు సినీ పెద్దలు కూడా ఏపీలో సినీ కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. సినీ నటులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని కూడా సీఎం జగన్ హామీ ఇచ్చారు. 


ఉగాది తర్వాత ప్రభుత్వంతో చర్చలు 


తాజాగా ఏపీలోని కర్నూలులో సినిమా చిత్రీకరణకు సంబంధించి అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయని సినీ నిర్మాత కేఎస్ రామారావు అన్నారు. కర్నూలు జిల్లాలో  సినిమాలు తీస్తే 20% రాయితీ లభించనున్నదన్నారు. ఇందులో భాగంగా ఇక నుంచి కర్నూలులో సినిమా తీయాలని నిర్ణయించామని ఆయన అన్నారు. ఈ విషయంపై ఉగాది పండగ అనంతరం సినిమా పెద్దలంతా ప్రభుత్వ పెద్దలను కలుస్తారని టాలీవుడ్ సినీ నిర్మాత కేఎస్ రామారావు స్పష్టం చేశారు. క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్ పై కేఎస్ రామారావు పలు చిత్రానలు నిర్మించారు. 


Also Read : AP Cabinet : ఏప్రిల్ 11న ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణం ! 8న గవర్నర్‌ను కలవనున్న సీఎం జగన్