ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనంపై ఏపీ ప్రభుత్వ వైఖరిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. అప్పుడు ‘అమ్మ ఒడి‘... ఇప్పుడు ‘అమ్మకానికో బడి' అని విమర్శలు చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి అప్పగించేందుకు నాలుగు ఆఫ్షన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 12న సర్కులర్ జారీచేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 2,200 ప్రైవేట్ స్కూళ్లల్లోని 2  లక్షల మంది విద్యార్ధులు, 6,700 మంది ఉపాధ్యాయులను, 182 ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లోని 71 వేల మంది విద్యార్థులను, 116 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లోని దాదాపు రెండున్నర లక్షలమంది విద్యార్థులను ఇబ్బందులపాలయ్యారని పవన్ కల్యాణ్ అన్నారు. విద్యార్థుల భవిషత్తును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. 






Also Read: విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది... ఏడేళ్లైనా హామీలు అమలు కాలేదన్న సీఎం జగన్.. స్పందించిన అమిత్ షా


విలీనంపై తొందరెందుకు


ఎన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు పనిచేస్తున్నాయన్న పవన్... విలీనంపై సమావేశాల్లో చర్చించాయా అని ప్రశ్నించారు. ఈ పాఠశాలల్లో ఎస్ఎమ్సీలు లేని పక్షంలో ఈ నిర్ణయానికి విలువ ఉండదన్నారు. ఇది విద్యాహక్కు సూత్రాలను ఉల్లంఘించినట్టు అవుతుందన్నారు. ఎయిడెడ్ సంస్థలను విలీనం చేసుకునేందుకు తొందరపడుతుందని విమర్శించారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. 


Also Read: దావోస్‌కు సీఎం జగన్ ! వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆహ్వానాన్ని మన్నిస్తారా ?






నిధుల మళ్లింపుపై అనుమానాలు


రాష్ట్రంలోని యూనివర్శిటీలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం వాటి నిధులను మళ్లించడం దురదృష్టకరమని జనసేనాని పవన్ కల్యాణ్‌ అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ నిధులను ప్రభుత్వ అవసరాలకు వాడుకోడానికి విశ్వవిద్యాలయం పాలక మండలిపై ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు. వైద్యవిద్య ప్రమాణాలు మెరుగుపర్చేందుకు నిధులు అందించాల్సిన ప్రభుత్వం ఉన్న నిధులను లాక్కోవాలని చూడటాన్ని విద్యావేత్తలు ఖండించాలన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వద్ద మిగులు నిధులు కింద రూ.450 కోట్లు ఉంటే.. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ వాటాకు రూ. 170 కోట్లు వెళ్లిపోతాయన్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రూ.250 కోట్లు తీసుకుంటే ఇక యూనివర్శిటికీ మిగిలేది రూ. 30 కోట్లే అన్నారు. కేవలం రూ.250 కోట్ల కోసం ప్రభుత్వం ఎందుకంత ఆత్రుత పడుతుందని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ నిధులను దేనికి ఖర్చు చేస్తారో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. 


Also Read: బడులను కాపాడుకున్న విద్యార్థులు ... ఎయిడెడ్ ఉద్యమంలో లాఠీ దెబ్బలకూ భయపడని స్టూడెంట్స్