మొండిగోడలే మిగిలిన ఊళ్లు.. ఎటు చూసినా కనిపిస్తున్న మృతదేహాలు.. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలు ...ఇదీ చిత్తూరు, కడప, నెల్లూరుల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్న దృశ్యాలు.  ప్రకృతి కనీవినీ ఎరుగని రీతిలో ఆగ్రహం చూపించిందనుకున్నా... ఆ ఆగ్రహాన్ని ఎదుర్కోవడానికి క్షేత్ర స్థాయిలో సిద్ధం కాకపోయినా .. కారణం ఏదైనా ప్రళయం మాత్రం ప్రజల మీద పడింది. ప్రాణాలు, ఆస్తులు అలా వరదలో కొట్టుకుపోయాయి.


Also Read : కదిరిలో కూలిన భవనాలు.. నలుగురు మృతి.. శిథిలాల్లో మరికొంత మంది


ఎటు వైపు చూసినా వరద విలయం ! 


విరుచుకుపడిన వరదలో కొట్టుకుపోయిన వారు కొట్టుకుపోతే ఒడ్డుకు చేరుకున్నవారు చేరుకున్నారు. మూగ జీవాలు జల సమాధి అయ్యాయి. గ్రామాలకు గ్రామాలు శిధిలమైపోయాయి. ప్రాజెక్టుల మట్టికట్టలు కొట్టుకుపోవడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం చిన్నది కాదు. విశాఖలో హుదూద్ సృష్టించిన బీభత్సానికి రెట్టింపు స్థాయిలో ఉంది. విశాఖ మొత్తం కళ కోల్పోయింది. రూపు రేఖలు మారిపోయాయి. అలాంటి పరిస్థి పరిస్థితే ప్రస్తుతం రాయలసీమ, నెల్లూరుల్లో  కనిపిస్తోంది. ఎక్కడ దృశ్యాలు చూసినా ఒళ్లు జలదరించిపోతోంది. అలా ఉప్పెనలా వచ్చి పడిన వరదలో ఇళ్లు, వాహనాలు కూడా కొట్టుకుపోయాయి.  మనుషులు,మూగ జీవాలు ఎన్ని జల సమాధి అయ్యాయో ఊహించడం కష్టమవుతోంది. ఈ విపత్తు వల్ల కొన్ని వందల, వేల కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి.


Also Read : నెల్లూరు జిల్లాను చుట్టుముట్టిన వరదనీరు.. ఊళ్లకు ఊళ్లనే తరలిస్తున్న అధికారులు..


టీటీడీ తీసుకున్నంత జాగ్రత్త ఇతర అధికారులు ఎందుకు తీసుకోలేకపోయారు ? 


వర్షాలు అత్యంత భారీగా పడబోతున్నాయని అధికారవర్గాలకు స్పష్టమైన సమాచారం ఉంది.  భక్తుల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించిన టీటీడీ రెండు రోజుల ముందుగానే దర్శనాలను ... ఘాట్ రోడ్డు, నడక దారుల్లో రాకపోకల్ని ఆపేసింది. దీని వల్ల ఎంత మేలు జరిగిందో.. అక్కడ వెలుగులోకి వస్తున్న విధ్వంస ఫోటోలే నిరూపిస్తున్నాయి.ఇదే జాగ్రత్తలు ఇతర చోట్ల యంత్రాంగం ఎందుకు తీసుకోలేకపోయిందనేది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. వచ్చిపడే వరదతో నిండే చెరువులు, ప్రాజెక్టుల గురించి ఎప్పటికప్పుడు అంచనాలు వేయడానికి దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకోవడానికి యంత్రాంగం అందుబాటులో ఉంది. కానీ ఎందుకనో కానీ టీటీడీ తీసుకున్న జాగ్రత్తల్లో కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. ఫలితంగా కనీవినీ ఎరుగని ప్రాణ, ఆస్తి నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.


 


Also Read : : రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే... వరదలపై ప్రధాని మోదీ ఆరా


నిర్లక్ష్యం ఎవరిది ? శిక్ష ఎవరికి ? 


అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వర్షాల విషయంలో ఎవర్నీ అప్రమత్తం చేయలేకపోయారు. ఫలితంగా ప్రాణనష్టం అనూహ్యంగా ఉంది. అధికారయంత్రాంగం ఎంత నిర్లిప్తంగా ఉందంటే వరద వస్తుందని తెలిసినా ఆర్టీసీ బస్సు సర్వీసుల్ని కొనసాగించారు. చివరికి ఆ బస్సులోవరదలో చిక్కుకుని పెద్ద ఎత్తున ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. మూడు బస్సులు వరదలో చిక్కుకుంటే సకాలంలో స్పందించలేకపోయారు. సమాచార వ్యవస్థ పూర్తిగా తెగిపోవడమే కారణం.  ఇక ప్రాజెక్టుల మట్టికట్టలు తెగిపోయి గ్రామాలను నీరు ముంచెత్తిన ఘటనలో కొట్టుకుపోయిన వారు ఎందరో అధికారులే చెప్పలేకపోతున్నారు. ఎలా చూసినా ప్రాణ నష్టం అనూహ్యంగా ఉంది. ఇది వరదల దాటికి  వందల కుటుంబాలు సర్వం కోల్పోయాయి. ఇది సామాన్యమైన నష్టం కాదు. కానీ తప్పు మాత్రం అధికారులది.. బాధితులు మాత్రం ప్రజలు అయ్యారు.


Also Read: తీరం దాటనున్న వాయుగుండం.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. మత్స్యకారులకు హెచ్చరిక!


ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్న బాధితులు !


ఎటు చూసినా కట్టుబట్టలతో మిగిలినపోయిన వారే ఎక్కువ మంది కనిపిస్తున్నాయి. ఇళ్లూ, వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రేమగా పెంచుకుంటున్న మూగజీవాలు ఏమైపోయాయో తెలియదు. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచుకుంటున్న పొలాలు ఏరులో కలిసిపోయాయి. ఇప్పుడు వారంతా ఆదరించే వారి కోసం చూస్తున్నారు. ఆదుకునే వారి కోసం చూస్తున్నారు.




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి