ఢిల్లీలో జరిగిన వైమానిక రంగ అభివృద్ధి సదస్సులో ఏపీ తరఫున మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. వైమానిక రంగ అభివృద్దికోసం ఏపీ చేపట్టిన చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు.  ప్రతి చోటుకీ వేగంగా వెళ్లగలిగేలా కనెక్టివిటీ, మూరుమూల గ్రామాలకు వెళ్లగల రవాణా, రహదారి, ఇతర మార్గాల సదుపాయాలతో ఉన్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఛాంపియన్ స్టేట్ లలో ఏపీ ఒకటిగా నిలిచిందన్నారు. విమానాశ్రయాలు, ఓడరేవులు, రహదారులకు కనెక్టీవిటీ వంటి వనరులు సమృద్ధిగా ఉన్న ఏపీ.. దేశానికే ఓ గ్రోత్ సెంటర్ గా నిలిచిందని వివరించారు. 


సాంకేతిక కారణాల వల్ల విమాన సర్వీసులు ఆలస్యం అయినపుడు, లేదా రద్దు అయినపుడు.. ప్రయాణీకులు సమాచారలోపంతో పడే ఇబ్బందులను ఈ సదస్సులో మంత్రి మేకపాటి ప్రస్తావించారు. వారి ఇబ్బందులు తొలగించాల్సిన బాధ్యత విమానరంగ సంస్థలపై ఉందని చెప్పారు. వైమానికరంగ ప్రగతికోసం ఇంధనంపై పన్నును 16 శాతం నుంచి 1 శాతానికి తగ్గించినందుకు.. ఏపీని కేంద్రం ఈ సందర్భంగా ప్రశంసించింది. అదే సమయంలో వైమానిక రంగ అభివృద్ధికై రాష్ట్రాల సమన్వయంతో ఏర్పాటు చేసిన సదస్సు విషయంలో.. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా చొరవను మంత్రి మేకపాటి అభినందించారు. వైమానికరంగంలో ఆంధ్రప్రదేశ్ అనేక ఆదర్శనీయ సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. 


5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధనలో, భారీ ఎగుమతుల ప్రోత్సాహంలో భారత్ లో ఏపీ టాప్ ప్లేస్ లో నిలిచిందన్నారు మంత్రి మేకపాటి. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ లో స్థాపించిన కొత్త విమానశ్రయానికి 1847 సమయంలో బ్రిటీష్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టామని చెప్పారు. కర్నూలు జిల్లాలోని విమానాశ్రయం ఏపీఏడీసీఎల్ ద్వారా, అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని విమానాశ్రయం సత్యసాయి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఏఏఐ ద్వారా ప్రకాశం జిల్లాలో ఎయిర్ స్ట్రిప్ లు నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. 2022 నాటికి ఈ ఎయిర్ స్ట్రిప్ లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బ్రిటీష్ కాలంలో అతిపెద్ద రన్ వేతో సేవలందించిన ప్రకాశం జిల్లాలోని దొనకొండలో విమానాశ్రయ పునరుద్ధరణకు ఆర్థిక సహకారం గురించి కేంద్ర మంత్రి వద్ద మంత్రి మేకపాటి ప్రస్తావించారు. 


మంత్రి ప్రస్తావించిన అంశాల్లో మరికొన్ని ముఖ్యాంశాలు.. 
- ఆంధ్ర ప్రదేశ్ లో 7 విమానాశ్రయాలు ఉన్నాయి
- ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో  5 పూర్తిస్థాయిలో సేవలందిస్తున్నాయి. వీటిలో  విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సకలసదుపాయాలున్నాయి.  రాజమండ్రి, కడపలో  దేశీయ విమానాశ్రయాలున్నాయి. 
- కరోనా ముందు వరకూ 5 మిలియన్లకు పైగా ప్రయాణీకుల రద్దీ కలిగిన ఉన్నాయి ఏపీ ఎయిర్ పోర్టులు. 
- 12,135 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సరకు రవాణా చేశాయి. 
- కొవిడ్ సమయంలో ఎదురైన ప్రతికూలతలను ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నాయి. 
- ఆంధ్రప్రదేశ్ 2030 నాటికల్లా పీపీపీ పద్ధతిలో వైమానిక మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యం పెట్టుకుంది. 


భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా చొరవతో రాష్ట్రంలో కొన్ని డిఫెన్స్, ఏరోస్పేస్ ఆధారిత తయారీ యూనిట్లకు ఏపీ ఆసక్తి కనబరిచింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని  బొడ్డువారిపాలెంలో మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ గ్రీన్ ఫీల్డ్ అల్యూమినియమ్ అలాయ్ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు ప్రతిపాదన చేశారు మంత్రి మేకపాటి. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు బీఈఎల్ లో అత్యాధునిక నైట్ విజన్ పరికరాల ప్రాజెక్టుకి ప్రణాళిక ఉందని చెప్పారు. అనంతపురం జిల్లాలోని పాలసముద్రం బీఈఎల్ లో మిసైల్ ఇంటెగ్రేషన్ ఫెసిలిటీ సెంటర్, ప్రకాశం జిల్లాలో భారత నేవీ ఆధ్వర్యంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) ట్రాన్స్ మిషన్ సౌకర్యం, ప్రకాశం జిల్లాలో ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ట్రైనింగ్ సౌకర్యం, భోగాపురంలో  మెగా ఎరోట్రొపొలిస్ ప్రతిపాదించిన ఎయిర్ కార్గో కాంప్లెక్స్, ఎంఆర్ఓ ఫెసిలిటీ, విశాఖపట్రం కేంద్రంగా సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, డీఆర్డీవో ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని నాగాయలంక వద్ద మిసైల్ టెస్టింగ్ యూనిట్, కర్నూలు జిల్లాలో డీఆర్డీవో సమక్షంలో నేషన్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ఏర్పాటుకు ఏపీ ఉత్సాహంగా ఉందని వివరించారు. 


Also Read: Anantapur Rains: కదిరిలో కూలిన భవనాలు.. ముగ్గురు చిన్నారులు మృతి.. శిథిలాల్లో మరికొంత మంది


Also Read: Nagababu: అనాగరికం... సాటి మనుషులపై క్రూరత్వం... నీచ సంస్కృతికి దిగజారకండి - వైసీపీ తీరుపై నాగబాబు హాట్ కామెంట్స్