"చంద్రబాబు గారు మాకు ప్రత్యర్థి అయ్యి ఉండవచ్చు... తెలుగుదేశం పార్టీ మాకు ప్రతిపక్షం అయ్యి ఉండవచ్చు. కానీ, చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక నేత ఇలా కన్నీటి పర్యంతం అయిన ఘటన నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది" అని నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు తెలిపారు. చంద్రబాబు నాయుడు కన్నీటిపర్యంతమైన ఘటన రాష్ట్ర రాజకీయ చరిత్రలో దుర్దినంగా ఆయన పేర్కొన్నారు. ఎంతో ఉన్నతమైన ఉత్తమమైనదిగా ప్రాచుర్యం పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు తలచుకుని బాధ పడలేక పడాలో తెలియని సందిగ్ధ దుస్థితి ఏర్పడిందని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయం రోజురోజుకీ పరాకాష్టకు నిలయంగా మారుతున్న దని ఆయన తెలిపారు.

ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని అసభ్యకర పదజాలంతో కించపరిచి తమని తాము హీనాతి - హీనమైన విలువలు లేని పురుగులుగా నిరూపించుకున్నారని అసభ్య వ్యాఖ్యలు చేసిన వారి తీరును నాగబాబు ఎండగట్టారు. ఒకరిని విమర్శించే నైతిక హక్కు తప్ప... ఒకరి కుటుంబాలను దూషించే అధికారం ఎవరికీ ఏమాత్రం లేదని ఆయన చెప్పారు.

"గతంలో నా తమ్ముడు పవన్ కళ్యాణ్, నా కుటుంబాన్ని ఇలాగే అనుచిత పదాలతో విమర్శించినప్పుడు ఎంతో క్షోభకు గురైన వ్యక్తిగా... ఆ బాధను అనుభవించిన మనిషిగా చెబుతున్నాను... ఇది అనాగరికం మరియు సాటి మనుషుల పట్ల క్రూరత్వం. నీకు ఒకరు చేసింది తప్పు అనిపిస్తే ప్రశ్నించు, నిలదీసి అడుగు. లేదా తప్పు ఉంటే కమిటీ వేసి నిరూపించి శిక్షించండి. అంతేకానీ ఇలాంటి నీచ సంస్కృతికి దిగజారకండి" అని వైసీపీ నాయకుల పేర్లు ప్రస్తావించకుండా... వైసీపీ తీరుపై సూటిగా తన అభిప్రాయాన్ని నాగబాబు వ్యక్తం చేశారు.


నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సైతం చంద్రబాబుకు మద్దతుగా ఇతరుల అభిప్రాయాన్ని ట్వీట్, రీట్వీట్స్ చేస్తూ మద్దతుగా నిలిచారు. పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ను ట్విట్ చేశారు. 




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి