వరద ప్రభావిత జిల్లాలైన  వైయస్సార్‌ కడప, చిత్తూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న జిల్లాల్లో రెండు రోజులపాటు సీఎం పర్యటిస్తారు.  నేరుగా బాధిత ప్రజలు, రైతులతో మాట్లాడనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును సీఎం స్వయంగా పరిశీలిస్తారు. ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలతో వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా మాట్లాడతారు.


మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన తిరుపతిలోనూ సీఎం పర్యటిస్తారు. రెండో రోజూ చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు వెళ్తారు. పెన్నానదీ పరీవాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, పంటపొలాలను స్వయంగా పరిశీలిస్తారు. అధికారులతో వరద నష్టం, సహాయ చర్యలపై సమీక్ష నిర్వహిస్తారు. 


డిసెంబరు 2న సీఎం పర్యటన ఇలా..
- ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి వైయస్సార్‌ కడప జిల్లాకు సీఎం జగన్ వెళ్తారు.
- 10.50 గంటలకు వైయస్సార్‌ కడప జిల్లా మందపల్లి(రాజంపేట) చేరుకుంటారు.
- అక్కడ నుంచి పుల్లపొత్తూరు గ్రామానికి వెళ్తారు.
- పుల్ల పొత్తూరు గ్రామంలో పర్యటించి వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తారు. 
- సహాయశిబిరంలో ఉన్న బాధితులతో మాట్లాడతారు.
- మధ్యాహ్నం 12 గంటలకు పుల్లపొత్తూరు గ్రామ సచివాలయానికి చేరుకుంటారు. 
- అక్కడ నుంచి ఎగుమందపల్లి వెళ్లి... గ్రామంలో వరద ప్రభావానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో  స్వయంగా కాలినడకన  పర్యటిస్తారు. 
- ఎగుమందపల్లి నుంచి నేరుగా అన్నమయ్య డామ్‌ సైట్‌కి వెళ్తారు. దెబ్బతిన్న ప్రాజెక్టును పరిశీలిస్తారు.


మధ్యాహ్నం 2.15 గంటలకు మందపల్లి చేరుకుని వరద నష్టం, అనంతరం సహాయ చర్యలపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష  నిర్వహిస్తారు.  అనంతరం మధ్యాహ్నం 3.05 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్‌కు వెళ్తారు. వరద నష్టంపై బాధితులతో మాట్లాడతారు. అనంతరం పద్మావతి అతిథి గృహం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు వరదనష్టం, సహాయ, పునరావాసంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి పద్మావతి అతిథి గృహంలోనే బస చేయనున్నారు. 


డిసెంబరు 3వ తేదీన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారు. డిసెంబరు 3వ తేదీ ఉదయం తిరుపతి, కృష్ణానగర్‌లో పర్యటించి, వరద నష్టాన్ని పరిశీలించడంతో పాటు స్థానికులతో మాట్లాడతారు.  అనంతరం వివిధ ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. అక్కడ నుంచి దర్గామిట్ట, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చేరుకుని వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను చూస్తారు. మధ్యాహ్నం 3.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి గన్నవరం చేరుకుని.. తాడేపల్లికి వెళ్తారు.


Also Read: ఏపీలో వరద బాధితులకు టాలీవుడ్ స్టార్స్ సాయం... చిరంజీవి, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తర్వాత ఎవరు?


Also Read: వరద బాధితులకు ఎన్టీఆర్ సాయం.. ఫ్యూచర్ సీఎం అంటూ కామెంట్స్..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి