CM Review On Health : ఏపీలో ప్రతి కుటుంబానికి డాక్టర్ అందుబాటులో ఉండేలా కొత్త విధానాన్ని సీఎం జగన్ అందుబాటులోకి తెస్తున్నారు. ,ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని జ‌గ‌న్ వైద్యాదికారుల‌ను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను  ఆగస్టు 1 నుంచి పెంచాలన్నారు.  సీఎంలేజ్‌ క్లినిక్స్‌కు, పీహెచ్‌సీలకు డిజిటల్‌ వీడియో అనుసంధానత ఉండాలని స్పష్టం చేశారు.  నూతన వైద్య కళాశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్న సీఎం,మెడికల్‌ కాలేజీల్లో వీలైనంత త్వరగా తరగతులు నిర్వహించేలా తగిన ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు.ఇప్పటికే ఆరోగ్య శ్రీ ద్వారా 2446 చికిత్సలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న విష‌యాన్ని అదికారులు సీఎం దృష్టికి తీసుకువ‌చ్చారు. 


ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు నగదు బదిలీ


ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వర్చువల్‌ బ్యాంకు ఖాతాలు తెర‌వాల‌ని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద డబ్బు నేరుగా రోగి వర్చువల్‌ బ్యాంకు ఖాతాలోకి... అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లింపు జ‌రిగేలా చూడాల‌ని, ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా కన్సెంట్‌ ఫాం, చికిత్స పూర్తైన తర్వాత ధృవీకరణ పత్రం తీసుకోవాల‌ని జ‌గ‌న్ అదికారుల‌కు సూచించారు. ధృవీకరణ పత్రంలో వైద్యంకోసం ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం నుంచి అందిన సహాయం వివరాలతో పాటుగా, రోగి కోలుకునేంత వరకూ ఆరోగ్య ఆసరా ద్వారా అందుతున్న సహాయం వివరాలు పొందుప‌ర‌చాల‌ని చెప్పారు.ఎవరైనా లంచం లేదా అదనపు రుసుము వసూలు చేసిన నేపథ్యంలో ధృవీకరణ పత్రంలో ఫిర్యాదుల కోసం ఏసీబీకి కేటాయించిన టోల్‌ఫ్రీ నంబర్‌ 14400 లేదా 104  పొందు ప‌ర‌చాల‌ని సూచించారు. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారం తర్వాత ఆరోగ్య సిబ్బంది సంబంధిత గ్రామానికి వెళ్లి ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిమీద విచారణ చేయాలని, మరింత సహాయం అవసరమైన పక్షంలో సమన్వయం చేసుకుని ఆ సహాయం అందేలా చూడాలని సీఎం అదికారుల‌తో అన్నారు.రోగికి అందిన సేవలు, అదనంగా కావాల్సిన మందులు, తదితర అంశాల పై కూడా ఫోన్‌కాల్‌ ద్వారా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాని సీఎం సూచించారు.


వేగంగా ప్రికాషన్ డోస్ ప్రక్రియ  
 
రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితుల పైన కూడ సీంఎ జ‌గ‌న్ స‌మీక్షించారు.పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అదికారులు సీఎం కు వివ‌రించారు.అక్కడక్కడా కోవిడ్‌ కేసులు ఉన్నా.. ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంద‌ని అధికారులు సీఎంకు వివ‌రించారు.కేవలం 69 మంది మాత్రమే ఆస్పత్రుల్లో ఉన్నారని, వీరందరూ కూడా కోలుకుంటున్నార అధికారులు అన్నారు.ఇప్పటికే 87.15శాతం మందికి ప్రికాషన్‌ డోసు వేశామని వెల్ల‌డించారు.ప్రికాషన్‌ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల‌ని సీఎం సూచించారు. ముఖ్యంగా 60ఏళ్ల పైబడ్డ వారికి ప్రికాషన్‌ డోసు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని జ‌గ‌న్ అన్నారు. 


వైద్యుల నియామకంపై సమీక్ష 


ఆస్పత్రుల సామర్థ్యానికి సరిపడా వైద్యులు, సిబ్బంది నియామకం పై సీఎం రివ్యూ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 40,476 పోస్టులను ప్రభుత్వం వచ్చాక భర్తీ చేశామన్న అధికారులు,జులై చివరి నాటి కల్లా సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలని సీఎం అదికారుల‌కు ఆదేశాలు ఇచ్చారు.ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకూ కూడా ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు, సిబ్బంది ఉండాలని,ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా చూడాలని జ‌గ‌న్  స్పష్టంచేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేంతోనే భారీ మార్పులకు శ్రీకారం చుట్టామని, దాంట్లో భాగంగానే ప్రమాణాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించడంతోపాటు, నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడం, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.