Chandrababu News :   మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ  ఈ తెల్లవారు జామున నంద్యాల లో అరెస్టు చేసింది. తెల్లవారు జామున మూడున్నర గంటలకే డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక  పోలీసు దర్యాప్తు బృందం చంద్రబాబు నిద్రిస్తున్న వాహనం వద్దకు వచ్చి ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు చెప్పింది. చంద్రబాబుకు .. పోలీసు అధికారులకు మధ్య వాదోపవాదాల తర్వాత ఆయన్ను ఉదయం ఆరుగంటల సమయంలో అధికారికంగా అరెస్టు చేస్తున్నట్లు చూపారు. 


ఐపీసీ సెక్షన్లతో పాటు, అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద చంద్రబాబును A1గా పోలీసులు చూపారు. అసలు ఏంటి ఈ స్కిల్ డవలప్మెంట్ స్కాం.. అందులో చంద్రబాబు పాత్ర ఏంటి.. సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఈ కేసులోని పదిపాయింట్లు. 


1. అంతర్జాతీయ సంస్థ సీమెన్స్ భాగస్వామ్యంతో ఏపీలో 3300కోట్ల రూపాయల నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో ప్రభుత్వ వాటా 10శాతం కడితే 90శాతం సీమెన్స్- డిజైన్‌టెక్ సంస్థలు ఇస్తాయి. డిజైన్ డెక్ సీమెన్స్ నాలెడ్జ్ పార్టనర్. ఇందులోనే 550 కోట్లు అవినీతి జరిగింది. దీనివల్ల 300కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. అప్పటి మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు, కార్మిక నైపుణ్యాభివృద్ధి మంత్రి అచ్చెన్నాయుడు  ఇందులో భాగస్వాములు అయ్యారు. 


2. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం రాష్ట్రంలో క్లస్టర్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టు ఖర్చులో 90శాతం సీమెన్స్- డిజైన్‌టెక్ సమకూరుస్తాయి. 


3. జీవో స్పూర్తికి విరుద్ధంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కుట్రపూరితంగా ఏపీస్కిల్‌డవలెప్‌మెంట్ కార్పోరేషన్ -APSSDC ని ను ఏర్పాటు చేశారు. సీమెన్స్-డిజైన్‌టెక్ ఎలాంటి ఖర్చూ చేయకుండానే జీఎస్‌టీతో కలిపి 10శాతం వాటా 371కోట్లు  డిజెన్‌టెక్‌కు చెల్లించేలా చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు.  అసలు సెంటర్లు ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయం జరక్కముందే  డబ్బులు చెల్లించారు. 


4. ప్రైవేటు రంగంలోని గంటా సుబ్బారావును APSSDC ఎండీ సీఈఓగా తేవడంతో పాటు.. ఉన్నతవిద్యాశాఖలో సెక్రటరీగా, ముఖ్యమంత్రి ఎక్స్ అఫీషియో సెక్రటరీగా కూడా బాధ్యతలు అప్పగించారు. 


5. ప్రభుత్వం ఇస్తున్న మొత్తాన్ని 10శాతం వాటాగా కాకుండా సీమెన్స్- డిజైన్ టెక్ సంస్థకు వర్క్ ఆర్డర్ గా ఇస్తున్నట్లు ఎంఓయూలో మార్పులు చేశారు. ఇదంతా అప్పటి సీఎం చంద్రబాబునాయుడు,  మంత్రి అచ్చెన్నాయుడుకు తెలిసే జరిగింది. కుట్రపూరితంగానే MOU లో మెన్షన్ చేయలేదు. 


6. దీనిపై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీరమేష్, ప్రత్యేక కార్యదర్శి సునీత అభ్యంతరాలు తెలిపారు. వీరిలో ఇరువురు సెక్షన్ 164, సీఆర్‌పీసీ కింద మెజిస్ట్టేట్ ముందు సమాచారం కూడా ఇచ్చారు. 


7. సీమెన్స్ అంతర్జాతీయ సంస్థకు తెలియకుండా సీమెన్స్ ఇండియా ఎండీ సుమన్‌బోస్, డిజైన్‌టెక్ ఎండీ వికాస్ కన్విల్కర్ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభుత్వం అందించిన ౩౩౦కోట్లలో దాదాపు 241 కోట్లను ఫేక్ ఇన్వాయిస్‌లు సమర్పించి సొమ్ముచేసుకున్నారు. 


8. సీమెన్స్ గ్లోబల్ సంస్థకు తెలియకుండా చంద్రబాబునాయుడుతో కుమ్మక్కై సుమన్‌ బోస్, వికాస్ ఈ కుంభకోణంలో పాలుపంచుకున్నారు. సీమెన్స్ గ్లోబల్ అంతర్గత విచారణలో ఈ విషయం తేలింది. 


9. డిజైన్‌టెక్‌కు ప్రభుత్వం ఇచ్చిన 371కోట్లలో  సీమెన్స్ సంస్థకు కేవలం 58కోట్లు మాత్రమే చేరాయి. సీమెన్స్ పరికరాలపై డిస్కౌంట్ ఇచ్చేందుకు మాత్రమే ఒప్పుకుంది. 90శాతం గ్రాంట్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఒప్పందంలో మొత్తం మార్చేశారు. 


10. ఈ మొత్తాన్ని హవాలా మార్గం ద్వారా పూనె, హైదరాబాద్ లో పలువురుకు చేరవేశారని సీమెన్స్ గ్లోబల్ గుర్తించింది. వికాస్ షెల్ కంపెనీలు సృష్టించడం ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించి ఆయన కంపెనీలను ఈడీ అటాచ్ చేసింది.