Chandrababu Naidu News: ఏపీ రవాణా శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి పోలీసులతో వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో మంత్రి భార్య హరితా రెడ్డి మాట్లాడిన తీరును ముఖ్యమంత్రి తప్పుబట్టారు. ఈ ఘటన తన దృష్టికి రావడంతో మంత్రితో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడి వివరణ కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా మసలుకోవాలని.. ఇలాంటి వైఖరిని సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఏ స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. 


అయితే, ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రాం ప్రసాద్ రెడ్డి.. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. రాయచోటిలో పోలీసులు తనకు కూడా ఎస్కార్ట్‌గా రావాలని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి ఓ పోలీసుతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారితో దురుసుగా ప్రవర్తించిన ఆమె తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా అయింది.