Purandeswari :  ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించడంతో సర్పంచ్‌లు బిల్లులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు.   కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద బీజేపీ నేతలు నిరసనకు పిలుపునిచ్చింది. ఒంగోలులో జరిగిన నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు.

  





 


పంచాయతీ నిధుల దారి మళ్లింపుతో గ్రామాలకు ఇబ్బంది  


రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్‌ను తుంగలో తొక్కిందని ఆరోపించారు. గ్రామాల్లోని ప్రజల అవసరాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. అంతేకాదు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు ఇచ్చిన నిధులను దారి మళ్లించడంతో నిధుల లేమి వల్ల గ్రామాల్లో అభివృద్ది పనులు జరగడం లేదని దగ్గుబాటి పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.  గ్రామాల్లో సొంతంగా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కనీస వసతులు కల్పించిన సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారన్నారు. కనీసం వారి బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించకపోవడం అన్యాయం అన్నారు. సొంత డబ్బులతో కాంట్రాక్ట్ పనులు చేసిన సర్పంచ్‌లు బిల్లులు రాకపోవడంతో ఆత్మహత్యకు సైతం పాల్పడ్డారని అన్నారు. సర్పంచ్‌ల ఆత్మహత్యల పాపం సీఎం వైఎస్ జగన్‌ది కాదా అని దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. 


బీజేపీ పోరాటంతో రూ. వెయ్యి కోట్లు పంచాయతీలకు జమ 


సర్పంచ్‌ల పోరాటానికి బీజేపీ మద్దతు ప్రకటించడంతో రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేసిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు పంచాయతీల నుంచి పెండింగ్‌లో ఉన్న కరెంటు చార్జీల పేరుతో ఆ రూ.1000 కోట్ల నుంచి రూ.600 కోట్లు కోత పెట్టాలని ప్రభుత్వం భావిస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోత పెట్టే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రంలో సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కృతమయ్యే వరకు... గ్రామ పంచాయతీల వ్యవస్థ మెరుగపరచడంతో పాటు దారి మళ్లించిన నిధులను తిరిగి చెల్లించే వరకు పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు.


మొత్తం నిధులు ఇచ్చే వరకూ పోరాటం జరుగుతుందన్న  పురందేశ్వరి


గ్రామ సర్పంచ్‌లు ఏళ్ల తరబడి నిరసనలు చేస్తుంటే సీఎం జగన్ ఒక్కసారైనా స్పందించారా అని పురంధేశ్వరి నిలదీశారు. సీఎం వైఎస్ జగన్ ఎంతసేపు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల గురించే పదేపదే ప్రస్తావిస్తున్నారని కానీ పంచాయతీ వ్యవస్థను పట్టించుకోవడం లేదన్నారు. నిలదీశారు. పెట్టి సర్పంచులు పనులు చేస్తున్నారని.. బిల్లులు రాక వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన సుమారు రూ.8000 కోట్లను స్వాహా చేసిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద  బీజేపీన నేతలు ధర్నాలు చేశారు.