బీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీపై కొత్త డ్రామాకు తెరతీసిందని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొన్న సింగరేణి , నిన్న విశాఖ ఉక్కు, నేడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందని సెటైర్లు వేశారు. నిన్నటిదాకా సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పిందే చెప్పి నమ్మించలేక అభాసుపాలయ్యారు అని విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. 


మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటుపరం చేయొద్దని తెలంగాణ మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దాంతో 
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీపై హరీష్ రావు కొత్త డ్రామాకు తెరలేపారని, బీఆర్ఎస్ నేతలు దేనికైనా దిగజారిపోతారంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్- అయ్యారు. అసలు ప్రతిపాదనే లేని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ గురించి హరీష్ రావు ఎందుకు బాధపడతారు? అని ప్రశ్నించారు. సింగరేణి, విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజల్ని నమ్మించలేకపోగా, ఇప్పుడేమో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీపై తప్పుడు ప్రచారం ప్రారంభించారని ఆరోపించారు. 


ఇలాంటి అంశాలపై దుష్ప్రచారానికి బదులుగా మూతబడిన వేల కొద్దీ ఎంఎస్ఎంఈలను తెరిపించే బాధ్యత ఎందుకు తీసుకోరు? అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. సెంటిమెంట్ రాజకీయాల కోసం దేనికైనా దిగజారిపోతారని "అగ్గిపెట్టె" విన్యాసమప్పుడే అందరికీ తెలిసిపోయింది అన్నారు. అయినా ఇలాంటి లేఖలు రాసేది మంత్రి కేటీఆర్ కదా, కొత్తగా మీరు లేఖలతో  వచ్చారేంటి ?  జాతీయ రాజకీయాలు మీకు (హరీష్ రావుకు).. రాష్ట్ర రాజకీయాలు కేటీఆర్‌కు అని ఒప్పందం చేసేసుకున్నారా  ? అంటూ తెలంగాణ మంత్రిని ఓ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. 






ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తుందనే ఆరోపణలు చేస్తూ..  బీఆర్ఎస్ నేతలు కేంద్రాన్ని విమర్శలు చేస్తున్నారు. ఇంతకు ముందు కేటీఆర్ ఇలాంటి లేఖలు రాయగా తాజాగా హరీష్ రావు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ లేఖ రాశారు. దేశ భద్రత, 74 వేల మంది ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. డిఫెన్స్ రంగంలో ఉన్న ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుంది. దీంతో నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుంది. ఇది మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుందన్నారు.  


మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి, సిబ్బందికి గత ఆర్థిక సంవత్సరంలో కావాల్సినంత పని ఉండేది. దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సమయానికి పూర్తి చేశారు. సంస్థ సిబ్బంది ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదు. దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని “సిక్ ఇండస్ట్రీ” గా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2500 మంది ఉద్యోగులు, పరోక్షంగా 5000 మంది ఉపాధి దెబ్బతింటుంది. మొత్తంగా సుమారు 25వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుందని హరీశ్ రావు లేఖలో పేర్కొన్నారు.