Pingali Venkaiah Name for Machilipatnam Medical College :  ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలకు గత ప్రభుత్వం పెట్టిన వైఎస్ఆర్ పేర్లను ప్రస్తుత ప్రభుత్వం తొలగిస్తోంది. తాజాగా మచిలీపట్నం మెడికల్ కాలేజీకి పెట్టిన వైఎస్ఆర్ పేరును తొలగించి పింగళి వెంకయ్య పేరును ఖారారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీలతో  పాటు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి కూడా వైఎస్ఆర్ పేరు పెట్టారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చారు. అదే సమయంలో ప్రతీ కాలేజీకి పెట్టిన వైఎస్ఆర్ పేరును తీసేసి దేశ నాయకుల పేర్లను పెడుతున్నారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీకి జాతీయ.పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు పెట్టారు.                       


దేశం కోసం పోరాడిన మహనీయుల పేర్లు పెడుతున్న  కూటమి ప్రభుత్వం           


ఓ రాజకీయ నాయకుడి పేరును పెట్టి ఉంటే వివాదమయ్యేది. కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మహనీయుల పేర్లను పెడుతోంది. ఈ పేరు మార్పు నిర్ణయాన్ని ఏపీబీజేపీ స్వాగతించింది.  మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు పెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం అద్భుతమైన నిర్ణయం. ప్రజలంతా ఆమోదించే నిర్ణయం. ఓ యోధునికి మనమిచ్చే గౌరవపూర్వక నివాళి అని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి తెలిపారు. 


స్వాగతించిన ఏపీబీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి                     
 
కూటమి ప్రభుత్వం మహనీయుల త్యాగాలను, వారి గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు సంకల్పంతో ఉందని మరోసారి నిరూపించుకుంది. మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు పెట్టాలని నిర్ణయించడాన్ని నేను స్వాగతిస్తున్నామన్నారు.  ప్రస్తుత కాలంలో రాజకీయ నేతలు ప్రజాధనంతో నిర్మిస్తున్న వాటికి తమ కుటుంబసభ్యులు పేర్లు పెట్టుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. ఒక్క దానికి కాదు.. ప్రతీ దానికి కుటుంబసభ్యుల పేర్లు పెట్టుకోవడం ఓ రివాజుగా మారిపోయింది. ఈ పరిస్థితిని మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడమే కాదు మహనీయులు, దేశం కోసం పోరాడిన తెలుగు వీరుల పేర్లు పెట్టాలని నిర్ణయించడం మంచిదని..  సంస్కృతిని కొనసాగించాలని కోరుకుంటున్నామన్నారు.  ఇప్పటికీ కొన్ని సంస్థలకు , వ్యవస్థలకు కూడా పెట్టేసిన పేర్లను కూడా మార్పు చేసి దేశానికి సేవ చేసిన వారి పేర్లను  పెట్టాలని విజ్ఞప్తి చేశారు.