UP Woman Killed Her Husband By Poisoning Him: తన భర్త దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, క్షేమంగా ఉండాలని ఓ మహిళ రోజంతా ఉపవాసం చేసింది. అనంతరం తన భర్తపై అనుమానంతో అతనికి ఆహారంలో విషం పెట్టి చంపేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌశాంబి జిల్లాలోని ఇస్మాయిల్‌పూర్ గ్రామానికి చెందిన సవిత అనే మహిళ తన భర్త శైలేష్ కుమార్ (32) ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం రోజంతా ఉపవాసం చేసింది. కర్వాచౌత్ సందర్భంగా మహిళలు తమ భర్తల క్షేమం కోసం ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. సవిత సైతం అలానే చేసింది. శైలేష్ సైతం భార్య పూజల కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. అయితే, ఆదివారం రాత్రి ఉపవాస దీక్ష విరమించే సమయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం నెలకొంది.


ఆహారంలో విషం కలిపి..


అనంతరం ఇద్దరూ కలిసి భోజనం చేశారు. అయితే, భర్తకు పెట్టిన భోజనంలో విషం కలపడంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. శైలేష్‌కు అతని భార్య ఆహారంలో విషం కలిపి హత్యకు పాల్పడిందని మృతుని బంధువులు ఆరోపించారు. ఘటన అనంతరం పరారైన భార్య సవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారించారు. తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని తట్టుకోలేకే అతనికి విషాహారం పెట్టినట్లు నిందితురాలు చెప్పిందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


Also Read: Baba Balaknath : ప్రసాదం పేరుతో మత్తుమందిచ్చి రేప్ చేశాడు - బాబా బాలక్ నాథ్‌పై మహిళ ఆరోపణ - సీఎం ఆశలు పోయినట్లే !