Notice To AP Emloyees Union :  ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.  గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఏడు రోజుల్లోగా తెలియచేయాలని నోటీసుల్లో జీఏడీ అధికారులు పేర్కొన్నారు.  వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయటం రోసా నిబంధనలకు విరుద్ధమని నోటీసుల్లో స్పష్టం చేశారు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసు జారీ చేసినట్టుగా ప్రభుత్వం పేర్కొంది. వేతనాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే మార్గం ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలున్నా గవర్నర్‌ను ఎందుకు కలిశారని ప్రశ్నించింది. వీరి సమాధానం తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సూర్యనారాయణ నేతృత్వంలోని ఉద్యోగుల సంఘం 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. జీతాలు, పెన్షనల చెల్లింపులో జాప్యం  కారణంగా ఉద్యోగులు పడుతున్న ఆర్థిక బాధలను ఆయనకు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల బకాయిలు తక్షణమే చెల్లించేందుకు గవర్నర్‌ చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు. ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడంలో విఫలమైందని గవర్ర్ తో భేటీ తర్వాత సూర్యనారాయణ రాజ్ భవన్ ఎదుట ఆరోపణలు చేశారు. ఇవి సంచలనం సృష్టించాయి. 


ఉద్యోగుల సంక్షేమంపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన ప్రభుత్వం


అయితే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపై ప్రభుత్వం స్పందించింది.  95 శాతం ఉద్యోగులకు ప్రతి నెలా 5వ తేదీలోపే జీతాలు చెల్లిస్తున్నామని ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులను మానవ వనరులుగా భావిస్తున్నామని.. వారే తమకు పెద్ద ఆస్తి అని పేర్కొంది. రాష్ట్ర విభజన సమస్యలు, కోవిడ్ సంక్షోభం ఉన్నా జీతాలు, పెన్షన్లు ఆపలేదని తెలిపింది.   వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను  వివరించారు. ప్రతి నెలా 5 తేదీన 90 నుంచి 95 శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను ప్రభుత్వం చెల్లిస్తున్నట్టుగా వెల్లడించారు. మిగిలిన 5 శాతం మందికి ఖజానాలో బిల్లలు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నట్టుగా పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాల బిల్లులు ఖజానా అధికారులకు నెలాఖరులోగా సమర్పించగలిగితే ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇవ్వగలం అని తెలిపారు.


ఉద్యోగ సంఘాల మధ్య వివాదం  


ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేసిన తర్వాత సూర్య నారాయణ చేసిన విమర్శలపై ఇతర ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఏపీ ఎన్జీవో సంఘం సాధించిన కారుణ్య నియామకాల ఉత్తర్వుల వల్లే సూర్యనారాయణకు ఉద్యోగం వచ్చిందని ... సూర్యనారాయణ అధ్యక్షత వహిస్తున్న ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేయాలని సీఎస్‌ను కోరతామని ఎపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రకటించారు.  సూర్యనారాయణ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులను తాకట్టు పెట్టుతున్నారని ఆరోపించారు. బండి శ్రీనివాసరావుపై సూర్యనారాయణ కూడా విమర్శలు గుప్పించారు.