రాష్ట్రంలో కోవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై గురువారం సీఎం జగన్‌ సమీక్షించారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కోవిడ్‌ తీవ్రత క్రమంగా తగ్గుతోందని అధికారులు తెలిపారు. అన్నిరాష్ట్రాల్లోనూ ఆంక్షలను సడలిస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 1,00,622 అయితే.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ బాధితులు 2,301 మంది మాత్రమే అని అధికారులు తెలియజేశారు. వీరిలో ఐసీయూలో ఉన్నవారు 263 మంది, వీరు కూడా దాదాపుగా కోలుకుంటున్నారని అధికారులు సీఎంకు తెలిపారు. 2144 మందికి ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. 104 కాల్‌ సెంటర్‌కు వస్తున్న కాల్స్‌ గణనీయంగా తగ్గాయని తెలిపారు. నిన్న వచ్చిన కాల్స్‌ కేవలం 246, ఇందులో ఆస్పత్రిలో జాయిన్‌ అయినవారు 18 మంది మాత్రమేనని వెల్లడించారు. 


వ్యాక్సినేషన్ పై ఆరా 


రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోందని సీఎం జగన్ అన్నారు. 3,73,71,243 మంది రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తి కాగా, 55,38,556 మందికి ఒక డోసు వ్యాక్సిన్ వేశారన్నారు. ప్రికాషనరీ డోస్‌ టార్గెట్‌ 12,60,047 కాగా ఇప్పటికే 9,79,723 మందికి వాక్సినేషన్‌ పూర్తి చేశారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 15–18 ఏళ్ల మధ్య వయసు వారందరికీ మొదటి డోసు పూర్తయ్యిందని వెల్లడించారు. 
ఫిబ్రవరి నెలఖారుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని ఖాళీలను భర్తీచేయాలని మరోసారి సీఎం స్పష్టం చేశారు. నాడు–నేడు కింద చేపట్టిన పనులను సమీక్షించాలన్నారు. అలాగే వైఎస్ఆర్ విలేజ్‌ క్లినిక్స్, అర్బన్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రగతిని సమీక్షించారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సూచించారు. 


నెలాఖరులోగా పోస్టుల భర్తీ


గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడంపై దృష్టి సారించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పుడు ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీచేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు అక్కడే ఉండి సేవలను అందించడానికి ఎలాంటి ప్రతిపాదన చేసినా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తానన్నారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందించే డాక్టర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నదానిపై అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పనిసరిగా ఆమోదిస్తానన్నారు. ఫిబ్రవరి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖలో పూర్తిగా ఖాళీలను భర్తీచేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


పాఠశాల విద్యాశాఖపై సీఎం సమీక్ష


నూతన విద్యావిధానం అమలుపై సీఎంకు అధికారులు వివరించారు. కొత్తగా వర్గీకరించిన ఆరు రకాల స్కూళ్లు, అందులో ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై అధికారులు తెలిపారు. 3 కి.మీ.లోపలే హైస్కూల్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మార్గదర్శకాలను అనుసరించే మ్యాపింగ్‌ చేస్తున్నామని ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అధికారులకు అవగాహన కోసం వర్క్‌షాపు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నూతన విద్యావిధానం వల్ల స్కూళ్లు మూతబడుతున్నాయనే ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తమని సీఎం తెలిపారు. చేస్తున్నది తరగతుల విలీనం తప్ప, స్కూళ్ల విలీనం కాదన్నారు. కొత్తగా ఏర్పాటు అవుతున్న స్కూళ్ల వల్ల ఇప్పుడున్న స్కూల్స్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ మూతబడవని స్పష్టం చేశారు. వచ్చే విద్యాసంవత్సరం (జూన్‌) నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలన్నారు. నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న స్కూల్స్‌ కారణంగా సుమారు 22 వేలమందికిపైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయన్నారు.