టీడీపీ నేత వంగవీటి రాధా, వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని కలవడం ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. గుడివాడలోని ఓ వైసీపీ లీడర్ ఇంట్లో జరిగిన వివాహానికి హాజరైన వీరిద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు. ఇలా వీళ్లిద్దరు కలవడం కొత్త కాకపోయినా ఇప్పుడున్న పొలిటికల్ సిచ్చుయేషన్ కారణంగా హాట్‌టాపిక్ అవుతోంది. 


గుడివాడలో కలుసుకున్న నేతలు 


కొడాలి నాని, వంగవీటి రాధ కలసి గుడివాడలో వైసీపీ నాయకుడు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. కొడాలి నాని గుడివాడలోనే ఉంటారు. వంగవీటి రాధ మాత్రం విజయవాడలో ఉంటారు. వైసీపీ నేత పెళ్ళి వేడుకకు రాధను ఆహ్వనించారు. ఇదే విషయాన్ని ఆహ్వనితులు కొడాలికి కూడా తెలియచేశారు. దీంతో వంగవీటి రాధ కోసం సుమారు అరగంటపాటు కొడాలి నాని వెయిట్ చేసి మరీ కలిశారు. వంగవీటి రాధ కారు దగ్గరకు వెళ్లి మరి రిసీవ్ చేసుకున్న కొడాలి నాని, ఇద్దరు కలసి వెళ్లి వధూవరనులను ఆశీర్వదించారు. దీంతో వైసీపీలో ఉన్న కొడాలి, టీడీపీలో ఉన్న రాధ కలయికపై మరోసారి రాజకీయవర్గాల్లో చర్చ మెదలైంది. ఇందులో కొత్తేమి లేదని వంగవీటి రాధ, కొడాలి నాని అనుచరులు చెబుతున్నారు. వీరిద్దరు ఎప్పటి నుంచో స్నేహితులు కావడంతో కలిసి పెళ్లికి హాజరయ్యారని అంటున్నారు.


ఇద్దరు ఎప్పుడు కలసినా రాజకీయ చర్చే 


ఈ ఇద్దరు నేతలు ఎప్పడు కలుసుకున్నా రాజకీయంగా చర్చ నడుస్తుంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఇద్దరు నేతలది వేర్వురు సామాజిక వర్గాలు. వంగవీటి రాధ కాపు సామాజిక వర్గానికి కీలక నేతగా ఉన్నారు. మాజీ శాసన సభ్యుడు కూడా 2019సార్వత్రికి ఎన్నికలకు ముందు వరకు వైసీపీలోనే ఉన్న వంగవీటి రాధ ఆ తరువాత టీడీపీలో చేరారు. ఇది రాజకీయంగా సంచలనమైంది. ఇక కొడాలి నాని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గుడివాడ నుంచి వరుస విజయాలు సాధిస్తూ వైసీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు. ఈ ఇద్దరు ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతలు. దీంతో ఇద్దరు నేతలు ఎప్పుడు కలుసుకున్నా, రాజకీయ వర్గాల్లో చర్యలు సర్వసాధారణంగా మారాయి.


వైసీపీ నుంచి టీడీపీకిలోకి- టీడీపీ నుంచి వైసీపీకి 


రాజకీయంగా ఈ ఇద్దరు నాయకులు వేర్వురు పార్టీల్లో ఉన్నారు. గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని వ్యవహారశైలిపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్దాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా అసెంబ్లీలో భువనేశ్వరి ప్రస్తానాన్ని నాని తీసుకొచ్చారి... దీనిపై కొడాలి నానికి ఇంటా బయట తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది. అతి మరింత తీవ్రరూపం దాల్చక ముందే వంగవీటి రాధ దాన్ని తగ్గించారని ప్రచారం ఉంది. వైసీపీని వదిలి టీడీపీలోకి వెళ్లిన రాధను తిరిగి తీసుకు వచ్చేందుకు కొడాలి ప్రయత్నిచారని టాక్ నడుస్తోంది. కాపు వర్గం నేతల్లో వంగవీటి కీలకం కావటంతో వైసీపీకి అవసరం ఉందనే కోణంలో కొడాలి ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే అది సాధ్యం కాలేదని కూడ పార్టీ నేతల్లో ప్రచారం ఉంది. ఇలా ఇరువురు నేతలు ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవటం తో పాటుగా రాజకీయాలకు అతీతంగా మిత్రులుగా కూడా కొనసాగుతున్నారు. అలాంటి వాళ్లు ఇప్పుడు మళ్లీ ఇలా కలుసుకోవడం భవిష్యత్ వ్యూహమేంటన్నది తెలియడం లేదు.