Krishna Teja: కొణిదల పవన్ కళ్యాణ్. పదేళ్ల పాటు అధికారం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న కీర్తిని దాటి తిరిగి ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే మార్గమని పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టిన వ్యక్తి. అనేక అవమానాలు అడ్డంకులు దాటి మొన్నటి ఎన్నికల్లో 21స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలు గెల్చుకుని అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేనాని. అలాంటి నాయకుడికి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎంతోపాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా,  పంచాయతీరాజ్, అటవీ-పర్యావరణం,సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వశాఖలు కట్టబెట్టారు. ఇక చేతిలో ఉన్నది ఐదేళ్ల పాటు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాళ్లకు మేలు చేయటం తిరిగి రుణం తీర్చుకోవటమే. అందుకోసం పవన్ కళ్యాణ్ కు ఓ అద్భుతమైన టీమ్ కావాలి. ప్రత్యేకించి పవన్ పాలనలో ఆయన అనుకున్న లక్ష్యాలను నెరవేర్చటానికి సివిల్ సర్వెంట్స్ అధికారులుగా ఉండటం అవసరం. RRR సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయని. అలా ఓ ఆయుధం యుద్ధాన్ని వెతుక్కుంటూ కేరళ నుంచి ఏపీకి వస్తున్నట్లు సమాచారం. ఆయన పేరే మైలవరపు కృష్ణతేజ. కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి. తెలుగు వ్యక్తి. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్.


ఎందుకు పవన్ కల్యాణ్ ఏరికోరి కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారిని తన పేషీలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారనేది చాలా ఆసక్తికరం. పవన్ కల్యాణ్ దృష్టిని అంతలా ఆకర్షించేలా కృష్ణతేజ తన ఏడేళ్ల కెరీర్‌లో ఎన్ని ఘనతలు సాధించారో తెలుసుకోవటం చాలా అవసరం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షలో 66 ర్యాంకు సాధించి విజేతగా నిలిచారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్‌లో అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ గా నియమితులైన కృష్ణతేజ చాలా తక్కువ సర్వీస్‌లోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. ఆయన కెరీర్‌లో అద్భుతమైన పేరు సంపాదించిపెట్టిన, పవన్ లాంటి నాయకులను అంతలా ఆకర్షించిన ఘటనలు ఏంటో చూద్దాం.


ఆపరేషన్ కుట్టునాడు
2018లో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఆ వరదల ప్రభావం భయానకంగా పడిన జిల్లాల్లో అలెప్పీ ఒకటి. వరదల సమయంలో అలెప్పీ జిల్లాకు సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజకు పూర్తి స్థాయి అధికారిగా అదే ఫస్ట్ పోస్టింగ్. రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పిలుచుకునే కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాతయనే ముందస్తు సమాచార సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజకు అందింది. అంతగా అనుభవం లాంటి ఆఫీసర్లు సాధారణంగా అలాంటి సందర్భాల్లో కలెక్టర్ పైనో, లేదా ఎమ్మెల్యేలు, మంత్రుల వంటి రాజకీయనాయకుల నిర్ణయాలపైనో ఆధారపడతారు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.


లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రెండున్నర లక్షల మంది ప్రజలను 48గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులు అందరితోనూ హుటాహుటిన సమావేశమైన కృష్ణతేజ ఈ రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించారు. పై అధికారులకు ఏం జరిగిందో తెలిసే లోపే స్థానిక యువతతో కలిసి 48గంటల్లో రెండున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి కృష్ణతేజ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆపరేషన్ కుట్టునాడు సూపర్ సక్సెస్. స్వయంగా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న కృష్ణతేజ వరదల ప్రభావం లోతట్టు ప్రాంతాల ప్రజలపై పడకుండా తప్పించగలిగారు. ఇది ఓ ఐఏఎస్ అధికారిగా ఆయన సాధించిన మొదటి విజయం. దేశంలోనే అతి సమర్థవంతమైన రెస్య్కూ ఆపరేషన్స్ లో ఒకటిగా ఆపరేషన్ కుట్టునాడు నిలిచింది.


ఐయామ్ ఫర్ అలెప్పీ 


ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సక్సెస్ చేసి కృష్ణతేజ ఊరుకోలేదు. వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చేయాలనే దిశగా ఆలోచనలను సాగించారు. ఓ ప్రభుత్వ అధికారిగా గవర్నమెంట్ నుంచి అందే సాయం కోసమే ఎదురుచూస్తూ కూర్చోకుండా 'ఐయామ్ ఫర్ అలెప్పీ' పేరుతో ఓ ఫేస్ బుక్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇది ఎంతో మంది కేరళవాసులను ఆకర్షించింది. అలెప్పీ కి తమ వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం ఇంటర్నెట్ లో వైరల్ గా మారటంతో వేరే రాష్ట్రాల నుంచి అలెప్పీ కోసం సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావు తన పత్రిక ద్వారా విరాళాలను సేకరించి అలెప్పీలో ఇళ్లను నిర్మించి బాధితులకు అందించాలనే ప్రాజెక్టును చేపట్టారు. ఆ బాధ్యతలను కృష్ణతేజకే రామోజీరావు అప్పగించారు. బాహుబలి టీమ్ ద్వారా రాజమౌళి, యాంకర్ సుమ ఇలా ఎంతో మంది అలెప్పీలో బాధితుల కోసం తరలివచ్చేలా కృష్ణతేజ మాట్లాడి ఒప్పించగలిగారు.




పడవలు కోల్పోయిన వారికి జోవనోపాధి కోసం పడవలు, నిత్యావసర సరుకులు, స్కూళ్లను తిరిగి కట్టడం, ఇళ్లు కోల్పోయిన బాధితులకు తిరిగి సొంత ఇంటిని కట్టించి ఇవ్వటం ఐయామ్ ఫర్ అలెప్పీ ఓ ఫేస్ బుక్ సాధించిన విప్లవం అంతా ఇంతా కాదు. యునిసెఫ్ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్లే పేజ్ ను మెయింటైన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు కృష్ణతేజ ప్రణాళికలు ఏ స్థాయిలో ఉంటాయో. వరదల కారణంగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మక నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ను తిరిగి ప్రారంభించేలా చేశారు. 2019లో కేరళవాసులు అక్కున చేర్చుకున్న అల్లు అర్జున్ ను, ఆ తర్వాత ఏడాది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ను బోట్ రేస్ కి అతిథులుగా పిలిచి పర్యాటకులను అలెప్పీ వైపు ఆకర్షించేలా కృష్ణతేజ చేయగలిగారు. ఇంత చేశారు కాబట్టే అలెప్పీ సబ్ కలెక్టర్ పొజిషన్ నుంచి బదిలీపై కృష్ణతేజ పర్యాటక శాఖకు వెళ్లిపోతున్నట్లు అలెప్పీ వాసులు తల్లడిల్లిపోయారు. అద్భుతమైన అధికారిని వదులుకోలేమంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.


పర్యాటక శాఖలో విప్లవాత్మక మార్పులు


కేరళ అంటేనే పర్యాటకం. అలాంటి పర్యాటక శాఖకు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన కృష్ణతేజ ఆ శాఖలోనూ తనదైన మార్క్ చూపించారు. మిషన్ ఫేస్ లిఫ్ట్ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాడుబడిపోయిన టూరిజం హోటళ్లను మోడ్రనైజ్ చేయించారు కృష్ణతేజ. KTDC ఆధ్వర్యంలోని రిసార్టులను అభివృద్ధి చేయటంతో పాటు మాయా పేరుతో ఓ చాట్ బోట్ ను క్రియేట్ చేయించి కేరళ టూరిజం కోసం వచ్చే పర్యాటకులను గైడ్ చేసేలా సాంకేతికతను రూపొందించటంలో కృష్ణతేజ సక్సెస్ అయ్యారు. క్యారవాన్ కేరళ పేరుతో ఓ చిన్న క్యారవాన్ ను అద్దె తీసుకుని కేరళలో నచ్చిన ప్రాంతానికి మీ కుటుంబంతో సహా తిరిగిరండి అంటూ ఆయన తీసుకువచ్చిన మరో ఆలోచన కేరళ టూరిజంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది.




ఇదే సమయంలో కరోనా విలయం కేరళను చుట్టేయటంతో ప్రజలకు మరింత సేవలను అందించేలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృష్ణతేజకు కేరళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ గానూ నియమించింది. అంతటి కల్లోల విపత్తులోనూ ప్రజలు ఆకలితో పస్తులు ఉండకుండా ప్రతీ ఇంటికి ఫుడ్ కిట్ ఇంకా నిత్యావసరాల కిట్ లను అందించేలా కృష్ణతేజ రూపొందించి రూట్ మ్యాప్ కేరళ మొత్తం ఆయన పనితీరును మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది.  ఆ తర్వాత తనకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టిన అలెప్పీ జిల్లాకే కలెక్టర్ గా నియమితులయ్యారు కృష్ణతేజ


అలెప్పీలో రిసార్టు మాఫియాను తరిమికొట్టి :


ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 కోట్ల రూపాయల ఆస్తి...కళ్లు చెదిరిపోయే రీతిలో కట్టిన 54 విలాసవంతమైన విల్లాలు...అన్నీ అక్రమంగా సరస్సును చెరచి కట్టుకున్నవే. జేసీబీ ఇనుప హస్తాలతో ఒక్కో దెబ్బ వేస్తుంటే ఒక్కొక్కటిగా కుప్పకూలిపోయేలా చేశారు కృష్ణతేజ. కేరళలోని అలెప్పీ జిల్లాలో ప్రవహిస్తున్న వెంబనాడ్ సరస్సు... Kapico రిసార్టు పేరు తెలియని వాళ్లుండరు. అంత విలాసవంతమైన రిసార్టు అది. సామాన్యులకు అసలు నో ఎంట్రీ. ఒక్క రాత్రి అక్కడ గడపాలంటే 55 వేల రూపాయలు. మూడెకరాల దీవిలో కట్టుకుంటామన్నారు. ఎలాగోలా అనుమతులు తెచ్చుకున్నారు. అడిగే వాడెవ్వడని దాన్ని పదెకరాలకు పొదుముకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన అమాయక మత్య్సకారులను తొక్కి పడేశారు. కానీ ఓ ఐదుగురు కుర్రాళ్లు మాత్రం తగ్గలేదు. కోర్టుల చుట్టూ తిరిగారు. వాళ్లకి మరింత మంది ప్రకృతి ప్రేమికులు తోడై న్యాయం స్థానం అనుమతులు తెచ్చుకున్నారు.  సమస్యంతా ఇక్కడే వాటిని అమలు చేసే అధికారి ఎవ్వడని. కానీ ఈసారి అలెప్పీ కలెక్టర్ గా అక్కడకు వచ్చింది 2018 వరదలు వచ్చినప్పుడు అదే అలెప్పీలో అణువణువూ తిరిగిన వ్యక్తి. చేతిలో సుప్రీం కోర్టు ఆర్డర్సు ఉంటే ఇంకెవ్వడికి భయపడాలి అన్నట్లు కృష్ణతేజ వ్యవహరించారు. ఒక్క పైసా కూడా ప్రజల ఖర్చు లేకుండా మొత్తం ఓనర్లతోనే డబ్బు కక్కించి 54 విల్లాలు కుప్పకూలేలా చేశారు కృష్ణతేజ. అలెప్పీలో రిసార్టు మాఫియాను తరిమికొట్టారు. కొవిడ్ కారణంగా తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు సెలబ్రెటీల ద్వారా చదువుకు సాయం అందించి అక్కడి పిల్లలకు కలెక్టర్ మామన్ గా పేరు తెచ్చుకున్నారు. ఎంత మంది చిన్నారులు కృష్ణతేజ బొమ్మలు గీసి ఆయనకే ప్రజెంట్ చేశారో లెక్కనే లేదు. అక్కడ పిల్లల దృష్టిలో ఆయన హీరో. ప్రజల దృష్టిలో సమర్థవంతమైన అధికారి.  





ప్రస్తుతం కృష్ణతేజ త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు. వీఐపీ అంటూ ఓటర్ కు పట్టం కడుతూ ఇటీవలే ఆయన అక్కడ ఆర్వోగా నిర్వహించిన ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రశంసలు అందుకున్నాయి. చిన్నారుల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన కేంద్రం నుంచి బాలల హక్కుల పరిరక్షణ అవార్డు దక్కేలా చేసింది. ఇవన్నీ గమనించిన పవన్ ఇలాంటి అధికారి తన పేషీలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు ను సైతం పవన్ కళ్యాణ్, కృష్ణతేజ కలిశారు. కేంద్రానికి సమాచారం అందించటం ద్వారా డెప్యూటేషన్ పై ఏపీకి వచ్చి పవన్ కళ్యాణ్ పేషీలో కృష్ణతేజ బాధ్యతలు చేపట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. నిఖార్సైన, నిజాయితీ, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న అధికారులు తన పేషీలో ఉంటే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించొచ్చనే పవన్ ఆశయానికి తోడుగా ఇప్పుడు కృష్ణతేజ లాంటి అధికారి తోడు అవ్వనున్నారని సచివాలయ వర్గాలైతే మాట్లాడుకుంటున్నాయి.