నార్నే రంగారావు ఫ్యామిలీ అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.1 కోటి భారీ విరాళం అందించింది. ఈ మేరకు నార్నే రంగారావు కుటుంబసభ్యులు హైదరాబాద్ లో సీఎం చంద్రబాబును కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు.


"ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఫౌండర్, చైర్మన్ నార్నే రంగారావు జ్ఞాపకార్థం... ఆయన సతీమణి డాక్టర్ శాంతారావు నార్నే ‘అన్న క్యాంటీన్’కు రూ.1,00,01,016 (రూ.1 కోటి వెయ్యి 16 రూపాయలు) విరాళంగా అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ‘అన్న క్యాంటీన్’ తిరిగి ప్రారంభించిన సమయంలో నారా భువనేశ్వరి  రూ. 1 కోటి విరాళంగా ఇచ్చి తనకు స్ఫూర్తి నింపారని డాక్టర్ శాంతారావు అన్నారు.


అనారోగ్యం కారణంగా చనిపోవడానికి ఒకరోజు ముందు రూ. 1 కోటి విరాళం అందించే విషయాన్ని నార్నే రంగారావు... డాక్టర్ శాంతారావు గారికి గుర్తుచేశారు. దీంతో ఆయన మరణానంతరం తన కుమార్తె, నార్నె ఎస్టేట్స్ డైరెక్టర్ అడుసుమిల్లి దీప, వైట్ ఫీల్డ్ బయో ఎండీ అడుసుమిల్లి నరేష్ కుమార్‌తో కలిసి వచ్చి శాంతారావు ఈ విరాళాన్ని సీఈవో నార్నె గోకుల్ తోడ్పాటుతో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. పేదలకు రూ. 5 లకే అన్నం పెట్టాలనే ఆలోచనకు... ఇలాంటి వారి మంచి మనసు ఎంతో దోహదం చేస్తుంది. ఎంతో నిజాయితీగా, ఆదర్శంగా జీవితాన్ని గడిపిన నార్నే రంగారావు కాలం చేయడానికి ఒక రోజు ముందు కూడా అన్న క్యాంటీన్ విరాళం గురించి భార్యకు గుర్తు చేయడం వారి గొప్ప మనసుకు నిదర్శనం. రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ.... అన్న క్యాంటీన్ కు విరాళం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులకు నా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను" అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు.