Guntur Harassment News: గుంటూరు జిల్లాలో ఓ మామ తన కోడలిని వేధిస్తున్న విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఈ విషయాన్ని ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. దీంతో ఈ విషయం బయటికి వచ్చింది. తన సొంత మామయ్య (భర్త తండ్రి) తనను లైంగికంగా వేధిస్తున్నాడని కోడలు కలెక్టరుకు ఫిర్యాదు చేసింది. తన భర్త నైట్ షిఫ్టుకు డ్యూటీకి (Night Shift Duty) వెళ్లగానే వేధింపులు మొదలవుతాయని ఫిర్యాదులో పేర్కొంది.


బాధితురాలు కలెక్టరుకు తెలిపిన ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. తన మామయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. తన తండ్రి ఓ మాజీ ఏఎస్సై. ఆయనపై కోడలు పోలీసుల‌కు స్పందన కార్యక్రమంలో (Spandana Program) ఫిర్యాదు చేసింది. గుంటూరుకు (Guntur) చెందిన మ‌హిళ ఎంఏ చదువుకొని ఓ కళాశాలలో అధ్యాపకురాలిగా ప‌ని చేసింది. 5 సంవ‌త్సరాల క్రితం ఓ మాజీ ఏఎస్సై కుమారుడితో ఈమెకు పెళ్లి జరిగింది. వీరికి ఒక బాబు సంతానం కూడా కలిగారు.


అయితే, ఏడాది కాలంగా తన అత్త పక్ష వాతం రావడంతో ఆమె ఇంట్లో మంచానికే పరిమితం అయింది. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించినా ఆమెకు నయం కాలేదు. మందులతో నెమ్మదిగా కోలుకుంటోంది. అప్పటి నుంచి తన తండ్రి వయస్సు ఉన్న మామయ్య ప్రవర్తనతో కోడ‌లికి చుక్కలు క‌నిపిస్తున్నాయి. తరచూ చేతులు వేస్తూ (Physical Harassment) వేధిస్తున్నాడు. తన స్మార్ట్ ఫోన్‌లో యూ ట్యూబ్‌లోని అసభ్య వీడియోలు చూపించి బలవంతం చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. భర్తను కావాల‌ని నైట్ డ్యూటీకి పంపి, రాత్రి స‌మ‌యంలో తన మామ అర్ధ నగ్నంగా వెకిలి చేష్టలు చేస్తున్నాడని లిఖిత పూర్వకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. 


అంతే కాకుండా తన భర్త ప్రమాదవశాత్తు చనిపోతే తనకు ఏ లోటూ లేకుండా చూసుకుంటానని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతున్నాడని ఆవేద‌న వ్యక్తం చేసింది. ఆయన గతంలో ఏఎస్సైగా పని చేసినందున పోలీసు శాఖలో చాలా పలుకుబడి ఉందని, ఎవ్వరూ ఏమీ చేయలేరనే ఉద్దేశంతో బెదిరిస్తున్నాడని వాపోయింది. త‌న‌కు ర‌క్షణ కావాలని వేడుకుంది. తన అత్తకు ఈ విషయం గురించి చెబితే, ఇలానే ఆయన ఎంతో మంది మహిళలను వేధించేవాడని, అతనితో జాగ్రత్తగా ఉండమని చెప్పిందని ఫిర్యాదులో పేర్కొంది. మామ‌య్య వేదింపుల నుండి రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఎస్పీని కోరిన‌ట్లు బాదితురాలు వెల్లడించింది.