Weather Updates : భానుడి భగ భగలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్త ఉపశనమం కలిగి వార్త ఇది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వ‌ర్షాలు పడే అవ‌కాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మెద‌క్, సంగారెడ్డి, న‌ల్లగొండ‌, సూర్యాపేట జిల్లాల‌కు వాతావరణ కేంద్రం ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మంగ‌ళ‌వారం వ‌ర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. మర‌ఠ్వాడా నుంచి క‌ర్ణాట‌క మీదుగా త‌మిళ‌నాడు వ‌ర‌కు ద్రోణి విస్తరించి ఉన్న కార‌ణంగా తెలంగాణలో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్లడించింది. రాబోయే 48 గంట‌ల పాటు హైద‌రాబాద్ లో వాతావరణం చల్లబడనుందని పేర్కొన్నారు. సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం పడే అవ‌కాశం ఉంది వాతావరణ కేంద్రం తెలిపింది. 






ఏపీలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు


శ్రీలంక సమీపంలో కొమరీన్ ప్రాంతంపై బంగాళాఖాతంలో అల్పపీడనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తమిళనాడు తీరం వరకు గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావంతోనే రాగల మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలలో రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశముందని తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాయలసీమలో రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని ప్రకటించింది. 


Also Read : New Districts Land Rates : కొత్త జిల్లాల్లో పెరగనున్న భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు!