Gudivada Casino Case: ఏపీలోని గుడివాడ క్యాసినో ఆరోపణలకు సంబంధించిన వివరాలను టీడీపీ నేతలు ఐటీ శాఖ అధికారులకు అందజేశారు. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేతృత్వంలో క్యాసినో నిర్వహించారంటూ టీడీపీ గతంలో ఫిర్యాదులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. వాటికి సంబంధించిన వివరాలు అందించాలని వర్ల రామయ్యను ఆధాయ పన్ను శాఖ కోరింది. ఈ క్రమంలోనే ఆ వివరాలను అందించేందుకు వర్ల రామయ్య, బొండా ఉమ, కొనకళ్ల నారాయణ, రావి వెంకటేశ్వర రావు.. విజయవాడలోని ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఎడ్ల పందాలు పెడుతున్నామని పైకి చెప్తూ వెనక క్యాసినో నడిపారని వర్ల రామయ్య ఆరోపించారు. 


గుడివాడలో క్యాసినో నిర్వహిస్తున్నామని చికోటి ప్రవీణ్ ప్రచారం చేసిన ఆధారాలను ఐటీ అధికారులకు అందించామని చెప్పారు. చికోటి ప్రవీణ్ తనకు స్నేహితుడేనని వంశీ స్వయంగా చెప్పినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలోకి కొడాలి నాని వేలాది మందిని రప్పించారని మండిపడ్డారు. వేలకు వేలు ఎంట్రీ ఫీజులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ క్యాసినోలో దాదాపు 500 కోట్ల మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయని అన్నారు. హవాలా రూపంలో ఆ నగదును దారి మళ్లించి ఉండవచ్చని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. హవాలా డబ్బును దారి మళ్లించడంలో చికోటి సాయ పడ్డారని అన్నారు. ఇందులో ఎంత మొత్తం చేతులు మారాయనే వివరాలను తాము ఐటీకి ఇచ్చినట్లు చెప్పారు. అలాగే క్యాసినో గురించి రాష్ట్ర అధికారులు ఎరూ పట్టించుకోలేదని అన్నారు. అందుకే కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేశామని వర్ల రామయ్య స్పష్టం చేశారు.


అసలు వివాదం ఇదీ..


గుడివాడలో సంక్రాంతి వేడుకల సందర్భంగా కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో తో పాటు పేకాట లాంటి జూదాలతో పాటు చీర్ గర్ల్స్ తో అసభ్య నృత్యాలు నిర్వహించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి.  అందుకు సంబంధించిన పలు వీడియోలను, ఫొటోలను అప్పట్లో తెలుగుదేశం నేతలు మీడియాకు విడుదల చేశారు. నిజనిజాలను నిగ్గుతేల్చేందుకు ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ నియమించారు.


ఆధారాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు 


ఆ తర్వాత వర్ల రామయ్య తాము సేకరించిన ఆధారాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారు. అప్పటి మంత్రి కోడాలి నాని ఆధ్వర్యంలోనే ఈ క్యాసినో జరిగిందని అని అన్నారు. ఈ అంశంలో కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, రెవిన్యూ ఇంటెలిజెన్స్, ఐటీ విభాగాలు రంగంలో దిగి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు.  జాతీయ స్థాయిలో పోరాడుతామని చెప్పారు.  మూడు రోజుల్లో క్యాసినో ద్వారా రూ. 250 నుంచి 500 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయని వర్ల రామయ్య ఆరోపిస్తున్నారు. మొత్తం 13 మంది చీర్ గర్ల్స్ ఇండిగో విమానంలో ప్రయాణం చేశారని వెల్లడించారు.గన్నవరం – బెంగళూరు. బెంగళూరు – గోవా, గోవా – విజయవాడ ప్రయాణీకుల వివరాలను మీడియా ముందు ఉంచారు. వీటిని దర్యాప్తు సంస్థలకు కూడా ఇచ్చారు. క్యాసినో పాల్గొనే వారి నుండి రూ.50వేల వరకూ వసూలు చేశారనీ, ఆ ప్యాకేజీలో భాగంగా లాడ్జి వసతి, ట్రాన్స్ పోర్టు, ఎంట్రీ ఫీజు అన్ని ఉచితమని వర్ల రామయ్య  సాక్ష్యాలు చూపించారు.