అమరావతిలో నిర్మాణాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. 70 శాతానికిపైగా పూర్తయిన ఏఐఎస్‌, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణ పనులు.. అలాగే హైకోర్టు న్యాయమూర్తుల నివాస భవనాల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి.  వీటిని ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.  ఇప్పటికే బ్యాంకుల కన్సార్షియం నుంచి ఓ విడత రుణం అందింది. రూ.200 కోట్లు ఇచ్చేందుకు కన్సార్షియం ముందుకొచ్చింది. ఇందులో ఇప్పటికే రూ.95 కోట్ల వరకు వచ్చాయి.మిగిలిన మొత్తం కూడా త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే నిర్మాణాలు ప్రారంభించాలంటే ముందు కాంట్రాక్టర్లకు బకాయిలు  చెల్లించాలి. బ్యాంకుల నుంచి వచ్చే రుణం మేరకు వారికి చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. 


తక్కువ నిధులతో అందుబాటులోకి వచ్చే భవనాల జాబితాను తీసుకుని ఆ మేరకు పనులను ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది.  త్వరలో మిగిలిన రూ.105 కోట్లు అందనుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నిధులతో ప్రస్తుతం పనుల వేగం పెంచాలని నిర్ణయించారు. ఇచ్చే రుణం అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లకే సరిపోతుంది. మిగిలిన టైప్‌ 1, 2, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణాలు 65 శాతం పూర్తయ్యాయి. వీటి పనులు తిరిగి ప్రారంభించేందుకు మరో మార్గంలో రుణం కోసం సీఆర్‌డీఏ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇటీవల కేంద్ర బడ్జెట్‌ 2022-23లో అమరావతి రాజధాని ప్రొవిజన్ ఇచ్చి మరీ నిధులను కేటాయించింది. ఇందులో అమరావతిలో ఏయే నిర్మాణాల కోసం నిధులు కేటాయిస్తున్నారో అన్న విషయం కూడా ప్రస్తావించింది. దీంతో ఈ నిధులను ఏపీ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాల కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తమకు కేటాయించిన భూముల్లో నిర్మాణాల గురించి సమీక్ష చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  అమరావతిలో కేంద్రప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలకు 2016 నుంచి 2019 మధ్యలో సీఆర్​డీఏ భూములు కేటాయించింది. 24 కేంద్రప్రభుత్వ సంస్థలకు 208 ఎకరాలు, 18 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు 27 ఎకరాల్ని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం రూ. 4 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కొన్నింటికి ఉచితంగా మరికొన్నింటికి తక్కువ ధరకు గత ప్రభుత్వం భూములు కేటాయించింది. 


జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా... తుళ్లూరు-రాయపూడి మధ్య తమకు కేటాయించిన స్థలానికి ఇటీవల ప్రహరీ నిర్మించింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ కొంతమేర నిర్మాణాలు చేపట్టింది. మిగతా సంస్థలేవీ నిర్మాణాలు మొదలుపెట్టలేదు. ప్రధాని మోదీ స్వయంగా వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారాలన్నీ అమరావతి నుంచే సాగుతున్నాయి. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు ప్రారంభించాలన్న డిమాండ్ పెరుగుతోంది. వాటి నిర్మాణాలు కూడా ప్రారంభమైతే రాజధానిపై భరోసా ఏర్పడుతుందని భావిస్తున్నారు.