సెప్టెంబరు 3న తిరువనంతపురంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశాల‌కు సీఎం జ‌గ‌న్ హ‌జ‌రు కావ‌టం లేదు. ఆయన తరఫున ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్‌రెడ్డితో కూడిన బృందం పాల్గోనుంది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి వర్ధంతి ఉండటం వల్ల తాను ఈ భేటీకి హ‌జ‌రు కావ‌టం లేద‌ని వివరించారు సీఎం జగన్.  


దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ టీఎం ఈ రివ్యూకు హాజరైంది. ఆ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఈ టీంకు సీఎం దేశానిర్దేశం చేశారు. 


రాష్ట్రం తరఫున 19 అంశాలను అజెండాలో ఉంచిన‌ట్లు సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. దీనిపై రియాక్ట్‌ అయిన సీఎం... రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అయినా కూడా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిపై మాట్లాడాలన్నారు. దీన్ని జోనల్‌ కమిటీ సమావేశంలో ప్రస్తావిస్తూ, వీటి పరిష్కారం కోసం దృష్టి పెట్టాలన్నారు సీఎం. పరిష్కారాలను సూచించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా కోరాల‌న్నారు. ఆ వ్యవస్థ కేవలం పరిష్కారాలను చూపించడమే కాకుండా తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేదిగా ఉండాలంటూ గట్టిగా డిమాండ్‌ చేయాలని సీఎం అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. 


విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్‌ లాంటి నగరాన్ని కోల్పోయిందని, ఇప్పుడు విభజన సమస్యలు పరిష్కారంలో ఆలస్యం అవుతున్నకొద్దీ... రాష్ట్రానికి తీవ్రంగా నష్టమే జరుగుతోందన్నారు సీఎం. అందుకే వీటి పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిందిగా సమావేశంలో గట్టిగా ఒత్తిడి తీసుకురావాలన్నారు సీఎం. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తగిన నిధులు విడుదల చేసే అంశాన్ని కూడా అజెండాలో ఉంచాలని ముఖ్యమంత్రి అన్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల స‌మావేవాల్లో ఏపీ త‌ర‌పున వాద‌న‌ను బ‌లంగా వినిపించేందుకు అవ‌స‌రం అయిన అన్ని చ‌ర్యలు తీసుకోవాల‌ని స్పష్టం చేశారు. 


ఇత‌ర్రాష్ట్రాలతో పోల్చితే ఏపీ ప‌రిస్థితి గురించి దేశం అంతా తెలుస‌ని, ఇలాంటి సంద‌ర్భంలో కూడా వైసీపీ ప్రభుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థకాల‌ను ప్రస్తావించాలని సూచించారు సీఎం. ఏపీ సాధిస్తున్న పురోగ‌తి వివ‌రించాల‌న్నారు. పోల‌వ‌రం వంటి క్లిష్టమ‌యిన అంశాల‌తోపాటుగా విభ‌జ‌న త‌రువాత ఏపీకి జ‌రిగిన అన్యాయం, రావాల్సిన వాటాలు, నిధులు, ఆస్తుల‌ను గురించి కూడ స్పష్టంగా తెలియజేయాలన్నారు సీఎం.